ఒకపక్క చినుకుల స్ట్రోకు… మరోవైపు ట్రైలర్ లేటు

హైదరాబాద్ లో జరిగిన ఓజి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అభిమానులు ఎదురు చూసింది రెండింటి కోసం. ఒకటి పవన్ కళ్యాణ్ స్పీచ్. రెండోది ట్రైలర్. మూడోది అనుకుంటే వేడుకకు పేరు పెట్టిన తమన్ మ్యూజికల్ కన్సర్ట్. అయితే వర్షం పెద్ద అడ్డంకిగా నిలవడంతో సంబరం పూర్తి స్థాయిలో జరగలేదు. సాయంత్రం నుంచే మబ్బులు ముసురుకోవడంతో చినుకులు ఉంటాయనే సమాచారం ఉన్నప్పటికీ అది పెద్ద హోరుగా మారదనే నమ్మకంతో ఉన్న నిర్వాహకులకు రైన్ పెద్ద షాక్ ఇచ్చింది. చాలా హుషారుగా మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ సైతం తన ప్రసంగాన్ని కుదించుకోవాల్సి రావడం తీవ్ర నిరాశకు గురి చేసింది.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే ఇంకా తుది మెరుగులు దిద్దుకునే పనిలోనే ఉండటంతో సకాలంలో స్టేజి మీద ప్లే చేయలేకపోయారు. దర్శకుడు సుజిత్ ఇంకా డిఐ వర్క్ ఉందని పవన్ తో చెప్పినా, డిప్యూటీ సిఎం ఏం పర్లేదు మా వాళ్ళు చూసుకుంటారు, ముందు ప్లే చేయమని చెప్పడంతో రఫ్ కట్ వెర్షనే తెరమీద ప్రదర్శించాడు. వీడియో మీద ఫర్ నిఖిల్ అని వాటర్ మార్క్ ఉందంటే అది టీమ్ సభ్యులకు పని కోసం ఇచ్చిన కాపీ అని అర్థమైపోయింది. అయినా సరే విజువల్స్ లైవ్ లో చూసిన అభిమానులు వెర్రెక్కిపోయారు. తాము కోరుకున్నది కనిపించడంతో వాళ్ళ ఆనందం అంతా ఇంతా కాదు.

అయితే కోట్లాది అభిమానులు ఆన్ లైన్ రిలీజ్ కోసం ఎదురు చూస్తే వాళ్ళు మాత్రం డిస్సప్పోయింట్ అయ్యారు. టెక్నికల్ గా ఎన్ని సమస్యలు ఉన్నా వాటిని ఈవెంట్ కు నాలుగైదు గంటల ముందే సరి చూసుకోవాలి. కానీ చివరి నిమిషం దాకా పని చేస్తూ ఒత్తిడి తెచ్చుకోవడం వల్ల నిర్మాణ సంస్థతో పాటు హీరో దర్శకుడు కూడా మాటలు పడాల్సి వస్తుంది. విడుదల తేదీ రెండు నెలల క్రితమే ఖరారు చేసుకుని షూటింగ్ కూడా టైంకి పూర్తి చేశాక ఇప్పుడీ ఆలస్యం ఎందుకనేది వేయి డాలర్ల ప్రశ్న. తమన్ అయితే ఈ రాత్రే ట్రైలర్ వచ్చేస్తుందని అంటున్నాడు. కల్ట్ ఫ్యాన్స్ అప్పటిదాకా జాగారం చేయాల్సిందే.