వంద కోట్ల గ్రాస్ దాటేసింది కాబట్టి మిరాయ్ బాగా నెమ్మదిస్తుందనుకున్న టైంలో మరోసారి నక్క తోక తొక్కేసింది. ఆంధ్రప్రదేశ్ లో టీచర్ల విన్నపానికి స్పందించి రెండు రోజులు ముందుగానే దసరా సెలవులు ఇచ్చేయడంతో ఒక్కసారిగా సాయంత్రం షోలు ఊపందుకున్నాయి. ఎలాగూ హాలిడేస్ కాబట్టి పిల్లలను సెకండ్ షోలకు తీసుకెళ్లడానికి తల్లితండ్రులు రెడీ అయిపోతున్నారు. ఈ ప్రభావం బుకింగ్స్ లో కనిపిస్తోంది. షో టైంకి హౌస్ ఫుల్స్ పడుతున్నాయని డిస్ట్రిబ్యూటర్ల టాక్. ఇదే జోరు బుధవారం దాకా కొనసాగుతుంది. గురువారం ఓజి రిలీజ్ ఉంది కాబట్టి అక్కడి నుంచి మిరాయ్ ఫైనల్ రన్ వైపు వెళ్తున్నట్టే.
ముందు చెప్పిన షెడ్యూల్ ప్రకారం అయితే ఏపీ సెలవులు బుధవారం నుంచి ఉండాలి. కానీ నారా లోకేష్ పుణ్యమాని అడ్వాన్స్ కావడం మిరాయ్ కలెక్షన్లకు దోహద పడుతుంది. అసలే రెగ్యులర్ టికెట్ రేట్లతో నిర్మాత విశ్వప్రసాద్ చేసిన రిస్క్ గొప్ప ఫలితాన్ని ఇచ్చింది. దాన్ని ఇంకా సద్వినియోగపరుచుకునేలా ఇప్పుడు హాలిడేస్ వచ్చి పడ్డాయి. ఒకవేళ జిఓ సహాయంతో రేట్లు కనక పెంచుకుని ఉంటే సెప్టెంబర్ 21 దాకా అమలులో ఉండేవి. దీని వల్ల ఒక వర్గం కుటుంబ ప్రేక్షకులు దూరంగా ఉండేవాళ్ళు. వాళ్లంతా వేరే ఆప్షన్ గురించి ఆలోచించకుండా మిరాయ్ కే ఓటేసి ఫ్యామిలీతో పాటు వెళ్లిపోతున్నారు.
ఇదే ఆఫర్ కిష్కిందపురికి ఉంది కానీ మరీ ఈ స్థాయిలో బెనిఫిట్ కలగకపోవచ్చు. హారర్ జానర్ తో పాటు కొంత మిక్స్డ్ టాక్ రావడం ఫలితం మీద ప్రభావం చూపించింది. అనూహ్యంగా డిమాన్ స్లేయర్ ఊపందుకోవడం గమనించాల్సిన విషయం. ఈ వారం వచ్చిన తాజా రిలీజుల్లో ఏదీ కనీసం యావరేజ్ లేకపోవడం మిరాయ్ కు దక్కిన మరో సానుకూలాంశం. ముందు అనుకున్న డేట్లు రెండు మూడు వదులుకున్నా ఫైనల్ గా మంచే జరిగింది. కాకపోతే సెప్టెంబర్ 25 ఓజి లేకపోయి ఉంటే మిరాయ్ కు కనీసం నాలుగు వారాల స్ట్రాంగ్ రన్ దక్కేదన్న కామెంట్స్ లో ఎంత మాత్రం అబద్దం లేదు. వాస్తవమే.
Gulte Telugu Telugu Political and Movie News Updates