రీరిలీజ్ గొడవ.. కొత్త సినిమాకు బ్రేక్

బాలీవుడ్లో మంచి అభిరుచి ఉన్న దర్శకుడిగా ఆనంద్ ఎల్.రాయ్‌కి పేరుంది. తను వెడ్స్ మను, తను వెడ్స్ మను రిట్నర్స్, రాన్‌జానా లాంటి హృద్యమైన చిత్రాలతో అతను ఘనవిజయాలు అందుకున్నాడు. ‘జీరో’ సహా కొన్ని చిత్రాలు ప్రేక్షకుల తిరస్కారానికి గురైనప్పటికీ ఆనంద్‌కు మంచి డిమాండే ఉంది. ప్రస్తుతం అతను ‘రాన్‌జానా’ తర్వాత మరోసారి ధనుష్‌తో జత కట్టాడు. ‘తేరే ఇష్క్ మే’ పేరుతో తెరకెక్కుతున్న వీరి సినిమాలో ప్రభుదేవా, కృతి సనన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దీని తర్వాత ఆనంద్.. తన బ్లాక్ బస్టర్ ఫ్రాంఛైజీ ‘తను వెడ్స్ మను’లో కొత్త సినిమా చేయాలని అనుకున్నాడు.

ఐతే తను వెడ్స్ మను, తను వెడ్స్ మను రిటర్న్స్ సినిమాలను నిర్మించిన ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థతో కాకుండా వేరే భాగస్వాములతో కలిసి సొంతంగా ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయాలనుకున్నాడు ఆనంద్. కానీ అతడికి ఈరోస్ సంస్థ బ్రేకులేసింది. ‘తను వెడ్స్ మను’ ఫ్రాంఛైజీ హక్కులు తమ వద్దే ఉన్నాయని.. ఇంకెవ్వరూ సొంతంగా ఆ సినిమా తీయడానికి వీల్లేదంటూ ఆ సంస్థ ఆనంద్‌కు లీగల్ నోటీసులు పంపినట్లు సమాచారం.

ఐతే ఈరోస్‌తో ఆనంద్‌కు ఎక్కడ తేడా కొట్టిందో కానీ.. ఇటీవల ‘రాన్‌జానా’ రీ రిలీజ్ సందర్భంగా వివాదం ముదిరింది. ఏఐని ఉపయోగించి క్లైమాక్స్‌లో హీరో బతికినట్లు మార్పు చేసి రిలీజ్ చేసింది ఈరోస్ సంస్థ. అది ఆనంద్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించి ఈరోస్ సంస్థ మీద విమర్శలు చేశాడు. హీరో ధనుష్ సైతం దీన్ని తప్పుబట్టాడు. ఆల్రెడీ ఉన్న గొడవ ఈ వివాదం వల్ల మరింత పెద్దదై ఇప్పుడు ఆనంద్‌కు ‘తను వెడ్స్ మను-3’ విషయంలో ఈరోస్ లీగల్ నోటీసులు ఇచ్చేవరకు వెళ్లింది. ఆ సంస్థ వేరే దర్శకుడితో ఆ సినిమా తీయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి ఆనంద్ అనుకుంటున్న సినిమా సంగతి ఏమవుతుందో చూడాలి.