హనుమాన్ తో సోలో హీరోగా తొలి బ్లాక్ బస్టర్ అందుకున్న తేజ సజ్జకు కెరీర్ లో మొదటి హిట్ అంటే జాంబీ రెడ్డి అనే చెప్పాలి. కాకపోతే దర్శకుడు ప్రశాంత్ వర్మకు ఎక్కువ క్రెడిట్ దక్కడం వల్ల తేజ హైలైట్ కాలేకపోయాడు. అయితే ఆ లోటుని హనుమాన్ తీర్చింది. ప్రస్తుతం మిరాయ్ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న తేజ సజ్జ దాన్నుంచి ప్యాన్ ఇండియా మార్కెట్ స్థిరపడిపోతుందనే నమ్మకంతో ఉన్నాడు. సాఫ్ట్ లవర్ బాయ్ పాత్రలకు దూరంగా లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్ల వైపే మొగ్గు చూపుతున్న ఈ యూత్ హీరో భవిష్యత్తులోనూ ఇదే ట్రెండ్ కొనసాగించేలా ఉన్నాడు. అందుకే జాంబీ రెడ్డి 2 గురించి ప్రస్తావిస్తున్నాడు.
త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళబోతున్న జాంబీ రెడ్డి 2ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనుందని సమాచారం. తొలుత సితార ఎంటర్ టైన్మెంట్స్ కోసం అనుకున్నప్పటికీ ఏవో కారణాల వల్ల చేతులు మారిందని వినికిడి. ఆ మధ్య పీపుల్స్ మీడియా నుంచి వచ్చిన కొత్త అనౌన్స్ మెంట్ కూడా దీని గురించేనట. ప్రీ లుక్ పోస్టర్ లో వదిలిన ఇమేజ్, ఫ్రమ్ రాయలసీమ టు ది ఎండ్ అఫ్ వరల్డ్ అంటూ పెట్టిన క్యాప్షన్ ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చింది. గతంలో దర్శకుడిగా రానా నాయుడు ఫేమ్ సుపర్న్ వర్మ పేరు వినిపించింది కానీ ఇప్పుడేమైనా మార్పు జరిగిందేమో ప్రొడక్షన్ హౌస్ చెప్పేదాకా ఖరారు కానట్టే.
అప్పుడంటే తేజ సజ్జ మార్కెట్, ప్రశాంత్ వర్మ లిమిటెడ్ మార్కెట్ ని దృష్టిలో ఉంచుకుని జాంబీ రెడ్డిని తక్కువ బడ్జెట్ తో తీశారు కానీ ఇప్పుడలా కుదరదు. స్కేల్ పెరిగిపోయింది. అంచనాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. పైగా విదేశాల్లో కూడా షూట్ ఉంటుంది కనక ఖర్చు అంతకంతా పెరుగుతూ పోతుంది. 2027 సంక్రాంతి స్లాట్ మీద అప్పుడే కన్నేసిన జాంబీ రెడ్డి 2 అదే మాట మీద ఉంటుందో లేదో కానీ ప్రస్తుతానికి ఏడాది లోపు షూటింగ్, ఫస్ట్ కాపీ సిద్ధం చేయాలనే కంకణం కట్టుకుంది. మిరాయ్ హడావిడి తగ్గాక దానికి సంబంధించిన పూర్తి వివరాలు బయట పెట్టబోతున్నారు. ఈ నెలాఖరుకు క్లారిటీ రావొచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates