కొత్త సినిమాలకు నిమజ్జనం ఎఫెక్ట్

రేపు మూడు సినిమాలు విడుదల కాబోతున్నా బుకింగ్స్ చెప్పుకోదగ్గ స్థాయిలో లేకపోవడం ఆశ్చర్యపరిచే విషయమే. అయితే ఈసారి సరిగ్గా రిలీజులు ఉన్న టైంలో వినాయక నిమజ్జనం రావడం ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపించేలా ఉంది. ఈ రోజు సెప్టెంబర్ 4 పండగ తర్వాత తొమ్మిదో రోజు. చాలా చోట్ల భారీ ఎత్తున సంబరాలు చేసుకుంటూ జనం ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. రాత్రి దాకా వీటిలో పాల్గొని అలిసిపోయిన యూత్ సహజంగానే థియేటర్లకు పరిగెత్తరు. ఏదో ప్రభాస్, మహేష్ బాబు లాంటి టయర్ 1 హీరోలైతే ఏదోలా ఓపిక తెచ్చుకుంటారు కానీ అనుష్క, శివ కార్తికేయన్, మౌళిలు అంత ఈజీగా జనాన్ని రాబట్టలేరు.

ఎల్లుండి సెప్టెంబర్ 6 హైదరాబాద్ తో పాటు నైజామ్, ఆంధ్రా తదితర ప్రాంతాల్లో నిమజ్జనం ఉండబోతోంది. ముందు రోజంతా ఏర్పాట్లలో నిర్వాహకులు బిజీగా ఉంటారు కాబట్టి వాళ్ళ తరఫున టీమ్స్ అన్నీ వేరే వాటి మీద ధ్యాస పెట్టవు. మరుసటి రోజు నిమజ్జనం కావడంతో ఆటా పాటలతో వేరే లోకం లేకుండా గడిపేస్తారు. దీంతో సహజంగానే సినిమాల మీద అంత ధ్యాస ఉండదు. పైగా పోటీలో ఉన్నవి స్టార్ హీరోలవి కాదు. అనుష్కకు ఫాలోయింగ్ ఉంది కానీ మరీ తన కోసమే థియేటర్లు కిక్కిరిసిపోయేంత జనం మొదటి రోజే రారు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టికి నవీన్ ఉండటం ప్లస్ అయ్యింది కానీ ఘాటీకి ఆ ఛాన్స్ లేదు.

ప్రభాస్ తో రిలీజ్ టీజర్ లాంచ్ చేయించడం, అనుష్కకు సంబంధించిన విజువల్స్ ఎక్కువ చూపించడం ద్వారా అంచనాలను సెట్ చేసిన ఘాటీ టీమ్ పూర్తిగా టాక్ నే నమ్ముకుంది. అయితే ఊహించని విధంగా నిమజ్జనం ప్రభావం వసూళ్లలో కనిపించడంతో ప్రమోషన్ల గేరు మార్చేసింది. దీనికే ఇలా ఉంటే ఇక మదరాసి గురించి చెప్పేదేముంది. అసలే డబ్బింగ్ బొమ్మ. అదిరిపోయిందని మాట వినిపిస్తే తప్ప ఆడియన్స్ ముందుకు రారు. ఉన్నంతలో లిటిల్ హార్ట్స్ కొంచెం యూత్ అటెన్షన్ తీసుకుంటోంది. సో రేపు గెలవబోయే సినిమా చాలా బాగుందనే టాక్ తేవాలి. రిస్క్ ఉన్నా సరే ఎవరి క్యాలికులేషన్లు వాళ్లకు ఉన్నాయి.