ఫెడరేషన్ కార్మికులతో ఛాంబర్ పెద్దలు నిర్వహించిన సమావేశం ఫ్లాప్ అయ్యింది. ఏ ఒక్క ప్రతిపాదనకు అంగీకారం రాకపోవడంతో సమ్మె యథావిధిగా కొనసాగుతోంది. నిర్మాతలు ప్రతిపాదించిన స్లాట్ విధానం పట్ల వర్కర్స్ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యిందని ఇన్ సైడ్ టాక్. ఖచ్చితంగా 30 శాతం పెంచాల్సిందేననే రీతిలో వాదోపవాదాలు జరిగాయని వినికిడి. కొందరు ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించినప్పటికీ అవి విఫలమయ్యాయి. మరో విడత చర్చలు ఎప్పుడు జరుగుతాయనేది ఈ రెండు మూడు రోజుల్లో తేలేలా లేదు. కొత్త రిలీజుల హడావిడి వల్ల కొందరు ప్రొడ్యూసర్లు ఈ మీటింగ్ కి రాలేకపోయారు.
ఎక్కడిక్కడ ఆగిపోయిన షూటింగుల వల్ల ఆయా ప్రొడక్షన్ యూనిట్లు పడుతున్న నరకం అంతా ఇంతా కాదు. కొన్ని రిలీజ్ డేట్లను అందుకోవాలంటే నాన్ స్టాప్ గా పనులు జరగాలి. కానీ అర్ధాంతరంగా బ్రేకులు పడటంతో మళ్ళీ ఆర్టిస్టుల డేట్లు తీసుకోవడం పెద్ద సవాల్ గా మారనుంది. పైగా ప్యాన్ ఇండియా సినిమాలకు సైతం మినహాయింపు ఇవ్వకపోవడంతో నష్టం క్రమంగా లక్షల నుంచి కోట్లకు చేరుకునేలా ఉంది. ఇప్పుడీ సమ్మె సంకెళ్లు ఎవరు తెంచుతారనేది పెద్ద ప్రశ్న. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజుతో మాట్లాడారు కానీ ఇంకా కార్యాచరణ రూపొందించలేదట.
తాజాగా జరిగిన ఫెడరేషన్ – ఛాంబర్ మీటింగ్ గురించి దిల్ రాజు మాట్లాడుతూ నిర్మాతలు ప్రతిపాదించిన పని విధానాలకు ఒప్పుకుంటే పెంపుకి సానుకూలంగా ఉన్నామని, ఇంకో రెండు మూడుసార్లు సమావేశాలు జరగాలని అన్నారు. కొన్నేళ్ల క్రితం జరిగిన అగ్రిమెంట్స్ లో రాసుకున్న నిబంధనలు అమలు కాలేదని వాటి గురించి కూడా చర్చించాలని చెప్పారు.
ఇంకోవైపు ఏపి మంత్రి కందుల దుర్గేష్ ఇది ఛాంబర్, ఫెడరేషన్ కలిసి పరిష్కరించుకోవాల్సిన సమస్య కాబట్టి తమవైపు నుంచి చేసేదేం లేదనే సంకేతం ఇచ్చారు. సీనియర్ హీరోలు సైతం మౌనంగానే ఉన్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ చొరవ తీసుకున్నా వ్యవహారం అంత సులభంగా లేదు. వీలైనంత త్వరగా దీనికి చెక్ పెట్టే ప్రయత్నాలు వేగవంతం చేయాలి. లేదంటే సెప్టెంబర్, అక్టోబర్ రిలీజులు చాలా డిస్టర్బ్ అవుతాయి. సంక్రాంతికి ప్లాన్ చేసుకున్న పెద్ద సినిమాలు సైతం ఇక్కట్ల పాలు కాక తప్పదు ఎవరి పట్టులో వాళ్ళు ఉన్నప్పుడు సొల్యూషన్ అంత సులభంగా దొరకదు. చూడాలి ఇంకెలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో.
Gulte Telugu Telugu Political and Movie News Updates