నాగార్జున ఇవ్వబోతున్న పెద్ద సర్ప్రైజ్

రేపు విడుదల కాబోతున్న కూలీలో అందరూ రజనీకాంత్ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు కానీ అసలైన బిగ్ సర్ప్రైజ్ నాగార్జున కాబోతున్నారనేది యూనిట్ నుంచి వస్తున్న విశ్వసనీయ సమాచారం. ఇప్పటిదాకా నాగే కాదు ఏ స్టార్ హీరో కనిపించనంత వయొలెంట్ షేడ్ లో కింగ్ షాక్ ఇస్తారని అంటున్నారు. నా పిల్లలు, మనవళ్లు మనవరాళ్లకు ఈ పాత్ర చూపించనని ముంబై ప్రెస్ మీట్ లో నాగార్జున చెప్పడం బట్టి చూస్తే ఇది అంచనా వేసినదాని కన్నా చాలా ఇంటెన్స్ గా ఉండబోతున్న క్లారిటీ వచ్చేసింది. అయితే ఎంత డోస్ లో ఉంటుందనేది అందరిలో రేగుతున్న సస్పెన్స్ లాంటి ప్రశ్న.

చెన్నై వర్గాల ప్రకారం నాగార్జున క్యారెక్టర్ ఏదో రెగ్యులర్ విలన్ తరహాలో ఉండదు. బాలీవుడ్ సైతం జడుసుకునే రేంజ్ లో దర్శకుడు లోకేష్ కనగరాజ్ దీన్ని స్పెషల్ గా డిజైన్ చేశాడట. ఒకరకంగా చెప్పాలంటే చాలా భాగం రజనీకాంత్ ని సైతం డామినేట్ చేసే స్థాయిలో సైమన్ పాత్ర స్టయిల్, స్వాగ్ ఉంటాయని వినికిడి. తన ఫ్యాన్స్ నిరాశపడకుండా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటానని లోకేష్ నుంచి హామీ వచ్చాకే నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. అందుకే ఏడెనిమిది నెరేషన్లు అవసరమయ్యాట. ఇది కనక క్లిక్ అయితే నాగార్జునకి ఇదే తరహా నెగటివ్ ఆఫర్ల వర్షం వెల్లువెత్తడం ఖాయం.

అయితే అభిమానుల కోణంలో చూసుకుంటే నా సామిరంగా తర్వాత నాగ్ కు ఎక్కువ గ్యాప్ వచ్చేసింది. కుబేర ఏదో అద్భుతం చేస్తుందనుకుంటే దాని వల్ల ధనుష్, శేఖర్ కమ్ముల ఎక్కువ లాభపడ్డారు కానీ చనిపోయే పాత్రలో నాగార్జునకి ఒరిగింది పెద్దగా ఏం లేదనే కామెంట్స్ ని కొట్టిపారేయలేం. ఆ అసంతృప్తిని కూలి తగ్గించాలి. బిగ్ బాస్ తొమ్మిదో సీజన్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో తన విలన్ ప్రయాణం స్పెషల్ గా ఉండాలని నాగార్జున కోరుకుంటున్నారు. హీరోగా బోర్ కొట్టేసిందని చెబుతున్న కింగ్ మరి విలన్ గా ఎలాంటి సత్తా చాటుతారో చూడాలి. ఇంకొన్ని గంటల వ్యవధిలో విషయమేంటో తేలిపోతుంది.