కూలీ టికెట్ రేట్ల మీద హాట్ డిస్కషన్

తెలంగాణలో కూలీ టికెట్ రేట్ల గురించి పెద్ద డిస్కషన్ జరుగుతోంది. ఇంకా అధికారిక జిఓ బయటికి రానప్పటికీ ఏ క్షణంలోనైనా వచ్చే సూచనలున్నందున దాంట్లో వివరాలు లీకుల రూపంలో చక్కర్లు కొడుతున్నాయి. వాటి ప్రకారం నైజాం మల్టీప్లెక్సుల్లో కూలి చూడాలంటే 350 నుంచి 453 రూపాయల దాకా చెల్లించుకోవాలనే వార్త మూవీ లవర్స్ గుండెల్లో బాంబులు పేలుస్తోంది. ఇదే కూలి చెన్నైలో దీంట్లో సగం రేట్ కే అందుబాటులో ఉండటం గమనార్హం. ఒకే కార్పొరేట్ మల్టీప్లెక్సులోనే రెండు నగరాల్లో వేర్వేరు ధరలు ఉండటం పట్ల సినీ ప్రియులు భగ్గుమంటున్నారు. వార్ 2 సైతం ఇంచుమించు ఇదే స్ట్రాటజీ పాటించనుందని సమాచారం. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉన్నదో తెలియాలంటే అధికారిక జీఓ బయటకి రావాల్సిందే.

ప్రాక్టికల్ గా చూస్తే రెండు డబ్బింగ్ సినిమాలే. ఒరిజినల్ వెర్షన్లు కాదు. జూనియర్ ఎన్టీఆర్, నాగార్జునలు నటించి స్వంతంగా డబ్బింగ్ చెప్పినంత మాత్రాన స్ట్రెయిట్ అయిపోవు. ఆ మాటకొస్తే వార్ 2 మొదటి టార్గెట్ హిందీ ఆడియన్స్. కూలి ఫస్ట్ ప్రిఫరెన్స్ తమిళనాడు ప్రేక్షకులు. అలాంటిది ఏపీ తెలంగాణలో మాత్రమే ఇంత ప్రేమ ఎందుకు చూపించాలనేది సగటు అభిమానుల ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంచుమించు ఇదే హైక్ రావొచ్చనే ప్రచారం జోరుగా ఉంది. ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. ఐ నుంచి భారతీయుడు 2 దాకా ఎన్నోసార్లు ఇలా పెంపులు తెచ్చుకుని వసూళ్లు చేసుకున్న దాఖలాలు చాలా ఉన్నాయి.

తెలుగు సినిమాలు తమిళనాడు, కేరళకు వెళ్ళినప్పుడేమో మనకు సరిపడా థియేటర్లు ఇవ్వడానికి అక్కడి డిస్ట్రిబ్యూటర్ సవాలక్ష కారణాలు చెప్పి తగ్గిస్తారు. చిరంజీవి నుంచి కిరణ్ అబ్బవరం దాకా అందరూ ఈ సమస్యను ఫేస్ చేశారు. కానీ ఎవరూ ఏం చేయలేని పరిస్థితి. కానీ మన దగ్గర మాత్రం రజని, సూర్య, విక్రమ్ హీరో ఎవరైనా సరే హైకులు ఇవ్వడానికి ముందు ఉంటామనేది ప్రేక్షకుల ఆవేదన. ఇది వ్యాపారం, ఎవరి ఇష్టం వారిదని చెప్పడానికి లేదు. సినిమా బాగుంటే ఎలాంటి పెంపులు లేకపోయినా రంగస్థలం లాంటి సినిమాలు చరిత్ర సృష్టించాయి. అలాంటి రోజులు మళ్ళీ ఎప్పటికి వచ్చేనో.