వార్-2 వెర్సస్ కూలీ కాదు.. వార్-2తో కూలీ

ఈ ఇండిపెండెన్స్ డే వీకెండ్లో రెండు భారీ చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతున్నాయి. అవే.. వార్-2, కూలీ. ఈ రెంటికీ దేని స్థాయిలో దానికి భారీగానే క్రేజ్ ఉంది. వీటిలో ఒకటి తప్పుకుంటుందేమో అని గతంలో ప్రచారం జరిగింది కానీ.. ఎవ్వరూ తగ్గలేదు. దీంతో థియేటర్ల కోసం కొట్లాట తప్పలేదు. కొన్ని నెలల ముందు నుంచే స్క్రీన్లు బ్లాక్ చేయడం మీద రెండు సినిమాల మేకర్స్ దృష్టిసారించారు. ఐతే యశ్ రాజ్ ఫిలిమ్స్‌కు ఉత్తరాదిన ఉన్న పట్టు వల్ల.. పైగా హృతిక్ రోషన్ హీరోగా నటించడం వల్ల వాళ్లకే మేజర్ స్క్రీన్లు దక్కాయి. తమిళనాడు, కేరళ, కర్ణాటక లాంటి దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం ‘కూలీ’ పైచేయి సాధించింది.

నార్త్ ఇండియా స్క్రీన్ల విషయంలో కొంత ఘర్షణ కూడా జరిగినట్లు వార్తలు వచ్చాయి. ‘కూలీ’కి మల్టీప్లెక్సుల్లో మరీ తక్కువ స్క్రీన్లు ఇవ్వడంతో ఈ చిత్రంలో ప్రత్యేక పాత్ర పోషించిన ఆమిర్ ఖాన్ రంగంలోకి దిగి దానికి థియేటర్లు, షోలు పెరిగేలా చూసినట్లు వార్తలు వచ్చాయి కానీ టీం నుండి ఎటువంటి స్పందన లేదు. రిలీజ్ టైంకి ఈ విషయంలో గొడవలు తలెత్తుతాయేమో అన్న చర్చ కూడా జరుగుతోంది.

ఐతే ఇంతకీ తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు సినిమాలకు థియేటర్ల కేటాయింపు ఎలా ఉంటుంది.. ఇక్కడ కూడా ఘర్షణ తప్పదా అన్న సందేహాలు కలిగాయి. కానీ ఇక్కడ అంతా సాఫీగా జరిగిపోతున్నట్లు సమాచారం. ‘వార్-2’ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ రిలీజ్ చేస్తుండగా.. ‘కూలీ’ హక్కులను ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ తీసుకున్నారు. ఆయనతో పాటు వేరే భాగస్వాములు కూడా ఉన్నారు. సునీల్, నాగవంశీ మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. పైగా వీళ్లిద్దరూ వారి చిత్రాలను నైజాం ఏరియాలో ఎస్వీసీ సంస్థతో కలిసి రిలీజ్ చేస్తున్నారు.

దీంతో సామరస్య వాతావరణంలోనే థియేటర్ల పంపకాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ‘కూలీ’కి బంపర్ క్రేజ్ ఉన్నప్పటికీ.. ఎన్టీఆర్ సినిమా కావడంతో ‘వార్-2’కు కాస్త ఎక్కువ థియేటర్లే ఇస్తున్నట్లు సమాచారం. నైజాంలో థియేటర్ల కేటాయింపుల్లో ఫుల్ క్లారిటీ ఉంది. ఏపీలో కొంత పోటాపోటీ నడుస్తోంది. అక్కడ కూడా సామరస్యంగానే వెళ్లేలా కనిపిస్తున్నారు. ఈ రెండు చిత్రాల తర్వాత టాక్, ఆక్యుపెన్సీలను బట్టి థియేటర్లు అటు ఇటు కావచ్చు. ప్రస్తుతానికి అయితే అంతా సాఫీగా నడుస్తోంది. రిలీజ్ తర్వాత కూడా ఏ ఇబ్బందీ ఉండకపోవచ్చని తెలుస్తోంది.