సమ్మెపై టాలీవుడ్ నిర్మాతల కౌంటర్ ఎటాక్‌

బడ్జెట్లు పెరిగిపోయి.. వసూళ్లు తగ్గిపోయి.. సక్సెస్ రేట్ పడిపోయి.. ప్రస్తుతం టాలీవుడ్ నిర్మాతల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. లాభాల సంగతి అటుంచితే.. పెట్టిన పెట్టుబడి వెనక్కి వస్తేనే హమ్మయ్య అనుకునే పరిస్థితి. తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయికి ఎదిగిపోయింది.. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేసింది అని సంబరపడడం నిజమే కానీ.. సక్సెస్ రేట్ దారుణంగా పడిపోయి నిర్మాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం. ఇలాంటి టైంలో తెెలుగు ఫిలిం ఫెడరేషన్ సమ్మెకు పిలుపునివ్వడం మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లే చెప్పాలి. 

సినీ కార్మికులకు 30 శాతం మేర పారితోషకాలు పెంచాలంటూ రెండు రోజుల కిందట స్ట్రైక్‌కు పిలుపునిచ్చింది ఫెడరేషన్. దీనిపై టాలీవుడ్ నిర్మాతల్లో ఆందోళన మొదలైంది. షూటింగ్స్ ఆగిపోయి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఐతే స్ట్రైక్‌కు భయపడి పారితోషకాలు పెంచితే అది నిర్మాతలకు చాలా భారం అవుతుంది.

ఈ నేపథ్యంలో ఫిలిం ఫెడరేషన్ డిమాండ్లకు లొంగకూడదని నిర్మాతలు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఫెడరేషన్‌తో సంబంధం లేకుండా వివిధ సినీ విభాగాలకు సంబంధించి ప్రతిభావంతులు ఎవ్వరైనా నేరుగా తమను సంప్రదించవచ్చని పిలుపునిచ్చారు. ఫెడరేషన్‌కు లక్షల్లో డబ్బులు కట్టాల్సిన పని లేదని చెబుతున్నారు. ఇందుకోసం వెబ్ సైట్ కూడా ఓపెన్ చేశారు. 

సమ్మె వల్ల కొన్ని రోజులు ఇబ్బంది పడ్డా సరే.. ఇలా నేరుగా తమను సంప్రదించిన వారితోనే పని చేయించుకోవాలని నిర్ణయించారు. ఇది ఫిలిం ఫెడరేషన్‌కు ఇబ్బందికర పరిణామమే. ఇదే ధోరణి కొనసాగితే.. ఫెడరేషన్ మనుగడే ప్రమాదంలో పడొచ్చు. కాబట్టి సమ్మె విరమించక తప్పని పరిస్థితి నెలకొంటుందని భావిస్తున్నారు. మరి ఈ వ్యవహారంలో చివరికి ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.