పరశురాముడి విశ్వరూపానికి పూనకాలు ఖాయం

మహావతార్ నరసింహ అంచనాలకు మించి బ్లాక్ బస్టర్ కావడం ఇండస్ట్రీ వర్గాలను నివ్వెరపరుస్తోంది. క్రేజీ ప్యాన్ ఇండియా మూవీస్ హరిహర వీరమల్లు, కింగ్డమ్ లను దాటుకుని మరీ భీభత్సం చేయడం ఎవరూ ఊహించనిది. ఒక యానిమేషన్ మూవీ వంద కోట్లకు పైగా వసూలు చేస్తుందని ఎవరు గెస్ చేస్తారు. ఎలాంటి ప్రమోషన్లు లేకుండా కేవలం మౌత్ పబ్లిసిటీతో ఇంత సక్సెస్ కావడం కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. దర్శకుడు అశ్విన్ కుమార్, ప్రొడక్షన్ పార్ట్ నర్ హోంబాలే ఫిలిమ్స్ కి ఇది జాక్ పాట్ గా మారింది. ఈ సిరీస్ లో నెక్స్ట్ వస్తున్న సినిమా మహావతార్ పరశురామ. దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

శ్రీమహావిష్ణువు దశావతారాలలో పరశురాముడు ఆరోది. త్రేతాయుగం ఆరంభంలో ఉద్భవిస్తాడు. కుల అధికార మదంతో విర్రవీగుతున్న క్షత్రియులను అంతమొందించిన చరిత్ర ఆయనది. భార్గవరాముడు, జమదగ్ని అనే మారుపేర్లు ఉంటాయి. పరశురాముడికి రామాయణ, మహాభారతం రెండు ఇతిహాసాలతోనూ సంబంధం ఉంది. శివ ధనుస్సును విరిచినందుకు రాముడిపై యుద్ధం ప్రకటించడం, ఆ తర్వాత శాంతించి విష్ణుచాపాన్ని అందించడం పురాణాల్లో ఉంది. భారతంలో కర్ణుడు, భీష్ముడు, ద్రోణాచార్యుడు ముగ్గురు అతిరధమహారధులకు పరశురాముడు గురువు. చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద వీరోచిత గాథ అవుతుంది.

ఇప్పటిదాకా సినిమాల్లో ఎవరూ పరశురాముడిని హీరోగా చేసి సినిమాలు తీయలేదు. ఒక భాగంగా చూపించడమో లేదా టైటిల్ గా వాడుకోవడమో తప్పింది తన గొప్పదనాన్ని చాటే ప్రయత్నాలు పెద్దగా జరగలేదు. ఇప్పటి తరానికి అది తెలిసేలా స్క్రిప్ట్ సిద్ధం చేశారని సమాచారం. ఈసారి విజువల్ ఎఫెక్ట్స్ కి మరింత ప్రాధాన్యం ఇచ్చి, బడ్జెట్ పెంచి, ఇండియన్ స్క్రీన్ మీద బెస్ట్ యానిమేటెడ్ సిరీస్ గా నిలిపే లక్ష్యంతో దీన్ని రూపొందిస్తున్నట్టు తెలిసింది. ప్రభాస్ లాంటి స్టార్ హీరోస్ తో ప్రధాన పాత్రకు డబ్బింగ్ చెప్పించే ఆలోచన కూడా జరుగుతోందట. ప్రస్తుతానికిది ప్రతిపాదన స్టేజిలో ఉంది.