ఇటీవలే రీ రిలీజైన రాంఝాన (తమిళ డబ్బింగ్ అంబికాపతి) క్లైమాక్స్ లో చనిపోయిన తన పాత్రను మళ్ళీ బ్రతికినట్టు ఏఐ ద్వారా మార్చేయడం ధనుష్ ని తీవ్రంగా కలవరపరిచింది. 12 సంవత్సరాల క్రితం తాను ఒప్పుకున్న సినిమా ఇది కాదని, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వాడి ఇలా చేయడం తప్పని చెబుతూ, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృత్తం కాకుండా కఠిన నిబంధనలు తీసుకు రావాల్సిన అవసరం చాలా ఉందని సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన ప్రత్యేక నోట్ లో పేర్కొన్నాడు. వినడానికి ఇదో చిన్న విషయంగా ఇప్పటికి కనిపిస్తున్నా భవిష్యత్తులో దీని పరిణామాలు తీవ్రంగా ఉండబోతున్నాయి.
రీ రిలీజ్ క్రేజ్ ఉందనే సాకుతో ఇలా ఇష్టం వచ్చినట్టు క్లైమాక్సులు, ముఖ్యమైన ఎపిసోడ్లను మార్చుకుంటూ పోతే క్రియేటివిటీ పక్కదారి పట్టడం ఖాయం. ఫ్యాన్స్ ఎమోషన్స్ ని క్యాష్ చేసుకునే ఉద్దేశంతో ఇలాంటి ప్రయోగాలు చేయడం బిజినెస్ కోణంలో వాళ్లకు రైట్ అనిపించవచ్చు. కానీ ఒరిజినాలిటీ దెబ్బ తిన్నాక దాని తాలూకు ప్రభావం తర్వాత జనరేషన్ల మీద పడుతుంది. ఉదాహరణకు ఇప్పుడు అంబికాపతి చూస్తున్న ఒక ఇరవై ఏళ్ళ కుర్రాడు ధనుష్ బ్రతికి ఉండటమే అసలు క్లైమాక్స్ అనుకుంటాడు. దీని వల్ల చనిపోయినప్పుడు పండాల్సిన ఎమోషన్ అతని కోణంలో జీరో అయిపోతుంది.
ధనుష్ భయపడుతున్న రిస్క్ ఇదే. ఇవాళ సభాపతికి చేశారు. రేపు ఇంకొకరికి చేయరనే గ్యారెంటీ లేదు. పెదరాయుడులో రజనీకాంత్ ని తిరిగి బ్రతికిస్తే ఏమవుతుంది. వినడానికి నవ్వొస్తుంది కానీ ఆ కోణంలో ఎవరైనా ఆలోచించి దానికి తెగబడితే దానికున్న క్లాసిక్ స్టేటస్ కి మచ్చ పడుతుంది. ఓ రెండు వేలు ఖర్చు పెడితే చనిపోయిన వాళ్ళను ఏఐలో సృష్టించి వాళ్ళ బంధువులు, పిల్లల పెళ్లిలలో వీడియోల ద్వారా డబ్బులు సంపాదిస్తున్న సంస్థలు పెరిగిపోతున్నాయి. అలాంటిది కోట్ల రూపాయలు పెడుతున్న నిర్మాతలు కనక టెంప్ట్ అయిపోయి ఇష్టం వచ్చినట్టు ఏఐ వాడితే అనవసరమైన రచ్చకు కారణం అవుతారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates