లోకేష్ ఇంటర్వ్యూ గురించి రజినీ కామెడీ


సూపర్ స్టార్ రజినీకాంత్ తెర మీద ఎంతగా కోలాహలంగా కనిపిస్తారో, ఎలా ఎంటర్టైన్ చేస్తారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. బయట దానికి భిన్నంగా ఎంతో సింపుల్‌గా కనిపించడమే కాక.. తన మీద తనే జోకులు వేసుకుని నవ్వించడమూ రజినీకే చెల్లు. ఆయన ఎప్పుడు స్టేజ్ ఎక్కినా నవ్వులు పండించడానికే ప్రయత్నిస్తారు. చెన్నైలో జరిగిన ‘కూలీ’ ప్రమోషనల్ ఈవెంట్లోనూ రజినీ తన మార్కు స్పీచ్‌తో అలరించారు. ముఖ్యంగా దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ గురించి రజినీ మాట్లాడిన తీరు.. ఆడిటోరియాన్ని నవ్వుల్లో ముంచెత్తింది. ‘కూలీ’ సినిమాను తన కంటే మిగతా వాళ్లే మీడియా ద్వారా బాగా ప్రమోట్ చేశారని రజినీ ఈ సందర్భంగా చెప్పడం విశేషం.

నాగార్జున, ఆమిర్ ఖాన్ ‘కూలీ’ గురించి ఇచ్చిన ఇంటర్వ్యూల వల్లే ఈ సినిమాకు హైప్ పెరిగిందని.. అలాగే దర్శకుడు లోకేష్ సైతం చాలానే ఇంటర్వ్యూలు ఇచ్చాడని రజినీ చెప్పాడు. ఐతే ఒక యూట్యూబ్ ఛానెల్‌కు లోకేష్ ఇచ్చిన ఇంటర్వ్యూను తాను చూశానని.. అది రెండు గంటల 10 నిమిషాల నిడివితో ఉందని రజినీ గుర్తు చేసుకున్నాడు. తాను కూర్చుని, నిలబడి, అటు ఇటు తిరుగుతూ ఆ ఇంటర్వ్యూ చూశానని.. కానీ అది ఎంతకీ అయిపోలేదని.. పడుకుని లేచిన తర్వాత కూడా ఇంటర్వ్యూ కంటిన్యూ అవుతూనే ఉందని రజినీ అనడంతో అందరూ పగలబడి నవ్వారు.

ఇక లోకేష్ తనకు కథ చెప్పడానికి వచ్చినపుడు.. తను కమల్ ఫ్యాన్ అని చెప్పాడని.. అలా ఎందుకు చెబుతున్నాడో అర్థం కాలేదని.. ఐతే ఈ స్టోరీ ఇంటలిజెంట్‌గా ఉండబోతోందని, తన స్టయిల్లో పంచ్ డైలాగులతో ఉండబోదని ఇన్‌డైరెక్ట్‌గా తనకు హింట్ ఇచ్చాడని తర్వాత అర్థమైందని రజినీ చమత్కరించాడు.

ఇలా చాలా వరకు నవ్విస్తూ సాగిన రజినీ.. తన స్పీచ్‌కు ఒక చోట ఎమోషనల్ టచ్ కూడా ఇచ్చాడు. తాను నిజ జీవితంలోనూ కూలీగా పని చేశానని గుర్తు చేసుకుంటూ.. ఒక సందర్భంలో తనతో బరువు మోయించిన ఒక వ్యక్తి రెండు రూపాయలు టిప్ ఇచ్చాడని.. చివరికి చూస్తే అతను తన క్లాస్ మేటే అని.. కాలేజీ రోజుల్లో జరిగింది మనసులో పెట్టుకుని తన మీద అలా ప్రతీకారం తీర్చుకున్నాడని.. అప్పుడు తాను కన్నీళ్లు పెట్టుకున్నానని రజినీ చెప్పడంతో అందరూ ఎమోషనల్ అయ్యారు.