జై హనుమాన్… ముందుకు కదులుతుందా?

టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత ఆశ్చర్యపరిచే హిట్లలో ఒకటనదగ్గ ‘హనుమాన్’ సినిమా రిలీజై ఏడాదిన్నర దాటిపోయింది. పెద్దగా పేరు లేని కాస్టింగ్.. పరిమిత బడ్జెట్.. అయినా సరే అద్భుతమైన ఔట్ పుట్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు ప్రశాంత్ వర్మ. పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషనల్ హిట్ అయిన ఈ సినిమాతో ప్రశాంత్ మీద ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయియి. ‘హనుమాన్’ సినిమాలోనే ఆ సినిమాకు సీక్వెల్ ప్రకటించిన ప్రశాంత్.. తర్వాత ఆ చిత్రంతోనే పలకరిస్తాడని అంతా అనుకున్నారు. 

కానీ ఇదిగో అదిగో అంటున్నారే తప్ప ఆ సినిమా ముందుకే కదలట్లేదు. మధ్యలో బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్‌తో ఓ సినిమా తెరపైకి వచ్చింది. తర్వాత మోక్షజ్ఞతో ఓ సినిమాకు అంతా సిద్ధం అన్నారు. ప్రభాస్‌తో ఓ సినిమా ఓకే అయినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇవేవీ కార్యరూపం దాల్చలేదు. ఇవన్నీ పక్కకు వెళ్లి ‘జై హనుమాన్’ అయినా పట్టాలెక్కుతుందేమో అనుకుంటే అదీ జరగట్లేదు.

‘జై హనుమాన్’లో కన్నడ నటుడు రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్ర చేస్తాడని ప్రకటించి చాలా కాలమైంది. కానీ తర్వాత ఏ అప్‌డేట్ లేదు. ‘కాంతార’ను ముగించాక రిషబ్ ఈ సినిమా కోసం అందుబాటులోకి వస్తాడనుకుంటే.. వేరే ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా ప్రకటిస్తూ వెళ్తున్నాడు. ఆల్రెడీ హిందీలో ఛత్రపతి శివాజీ బయోపిక్ చేయాల్సి ఉంది. ఇప్పుడేమో అశ్విన్ గంగరాజు గుణ్ణం దర్శకత్వంలో రిషబ్ హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ ఒక భారీ చిత్రాన్ని ప్రకటించింది. మరోవైపు ‘కాంతార’కు మరో సీక్వెల్ కూడా చేయాలని రిషబ్ అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇన్ని సినిమాల మధ్య ‘జై హనుమాన్’ ఎప్పుడు చేస్తాడన్నదే అర్థం కావడం లేదు. అసలు ప్రశాంత్ వర్మ తర్వాత ఏ సినిమాను టేకప్ చేస్తాడో.. ఏది ముందుకు కదులుతుందో అర్థం కాని అయోమయం నెలకొంది. వెంటనే అందుబాటులోకి వచ్చే అవకాశం లేని రిషబ్‌ను కాకుండా ఎవరైనా తెలుగు నటుడినే పెట్టుకుని ‘హనుమాన్’ రిలీజైన తర్వాత వీలైనంత త్వరగా ‘జై హనుమాన్’ను మొదలుపెట్టి ఉంటే ఈ పాటికి రిలీజ్ కూడా అయిపోయేదని.. ఇప్పుడు ఈ అయోమయం మధ్య ప్రశాంత్ ఈ సినిమాను తెరకెక్కిస్తాడో లేదో అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ప్రేక్షకులు.