కన్నడ కథానాయకుడు దర్శన్.. తన అభిమానే అయిన రేణుక స్వామి అనే వ్యక్తిని తన బృందంతో కలిసి దారుణంగా హింసించి హత్య చేయించినట్లు అభియోగాలు ఎదుర్కోవడం గత ఏడాది ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. కారణాలు ఏవైనా కానీ.. రేణుకస్వామిని దర్శన్ అండ్ కో హింసించిన తీరు ఘోరాతి ఘోరం. తన గాయాలు, అనుభవించిన చిత్రహింస గురించి మీడియాలో వచ్చిన వార్తలు ఒళ్లు గగుర్పొడిచేలా చేశాయి. ఈ హత్యలో దర్శన్ స్వయంగా పాల్గొన్నట్లు ఆధారాలు ఉండడంతో అతను జైలు పాలయ్యాడు. ఐతే ఆరు నెలలు తిరిగేసరికే అతను రెగ్యులర్ బెయిల్ మీద బయటికి వచ్చేశాడు.
ఈ హత్య చేయించింది దర్శనే అని.. స్వయంగా అతనే రేణుకాస్వామిని హింసించాడని ఆధారాలున్నా… ఎఫ్ఐఆర్లో పోలీసులు స్పష్టంగా పేర్కొన్నా.. దర్శన్కు బెయిల్ రావడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఐతే ఇప్పుడు ఇదే విషయమై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్కు బెయిట్ ఇవ్వడాన్ని సుప్రీం కోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ఈ విషయంలో కర్ణాటక హైకోర్టును సర్వోన్నత న్యాయస్థానం మందలించింది.
దర్శన్కు బెయిల్ ఇవ్వడంపై స్పందిస్తూ.. ప్రాథమిక న్యాయ అధికారాన్ని దుర్వినియోగం చేయడమే అని పేర్కొంది. హైకోర్టు అన్ని కేసుల్లో ఇలాగే చేస్తుందా.. ఈ కేసును ప్రత్యేక దృష్టితో చూసిందా అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. బెయిల్ మంజూరు సందర్భంగా హైకోర్టు ఉపయోగించిన భాష మీద సుప్రీం కోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. నిందితుడు హత్య చేసినట్లు సరైన ఆధారాలు లేవని ఎలా అంటారని సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. హైకోర్టు చేసిన తప్పును తాము చేయబోమని.. ఈ కేసు విషయంలో తీవ్రంగా ఉంటామని స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు వ్యాఖ్యలను బట్టి చూస్తే త్వరలో దర్శన్ బెయిల్ రద్దవుతుందనే చర్చ జరుగుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates