పవన్ పొగడ్తలతో మబ్బుల్లో తేలుతున్న నిధి అగర్వాల్

సాధారణంగా పవన్ కళ్యాణ్ దర్శకులు, నిర్మాతలను పొగిడినంతగా హీరోయిన్లను ప్రశంసల్లో ముంచెత్తడం అరుదు. కానీ నిధి అగర్వాల్ ఆ ఛాన్స్ కొట్టేసింది. ఇవాళ జరిగిన హరిహర వీరమల్లు ప్రెస్ మీట్ లో పవన్ మాట్లాడుతూ నిధి అగర్వాల్ ప్రమోషన్ల భారాన్ని మొత్తం తన భుజాల మీద మోస్తుంటే తనకే సిగ్గనిపించిందని, సినిమాని అనాథలా వదిలేశామనే ఫీలింగ్ కలిగిందని,  అలాంటిది లేదని చెప్పడానికి తాను సమావేశానికి వచ్చానని, నా చిత్రాన్ని నేనే ఎందుకు వదిలేస్తానని చెప్పుకొచ్చారు. నిధికి ఇది చాలా పెద్ద కాంప్లిమెంట్. అంటే ఆమె ఎంత సీరియస్ గా పబ్లిసిటీలో భాగం పంచుకుంటుందో పవన్ చూశారన్న మాట.

పవన్ చెప్పినదాంట్లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే సమయాభావం వల్ల హరిహర వీరమల్లులోని మెయిన్ క్యాస్టింగ్ ఎవరూ ఇంటర్వ్యూలకు అందుబాటులో లేరు. సత్యరాజ్, బాబీ డియోల్, సునీల్, సుబ్బరాజు లాంటి వాళ్ళు వేర్వేరు కారణాలతో వచ్చే పరిస్థితిలో లేదు. కీరవాణికి వ్యక్తిగతంగా కుటుంబంలో జరిగిన విషాదం వల్ల మీడియా ముందుకు రాలేకపోయారు. దర్శకుడు జ్యోతికృష్ణ, నిర్మాత ఏఎం రత్నం పనుల్లో బిజీగా ఉన్నారు. దీంతో నిధి అగర్వాల్ అంతా తానై చూసుకుంది. ఒక రోజు ఏకంగా 16 మీడియా ఇంటర్వ్యూలు ఇచ్చి నాన్ స్టాప్ గా కో ఆపరేట్ చేసింది. ఇంత ఓపికగా ఉండటం అరుదే.

ది రాజా సాబ్ డిసెంబర్ లో రిలీజ్ కానుండటంతో నిధి అగర్వాల్ కు ఇప్పుడీ హరిహర వీరమల్లు సక్సెస్ చాలా ముఖ్యం. అందులోనూ ఇస్మార్ట్ శంకర్ అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినా కెరీర్ వేగంగా పరుగులు పెట్టలేదు. చేసిన కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో పవన్ కళ్యాణ్, ప్రభాస్ కోసం వేరే కమిట్ మెంట్స్ ఇవ్వకుండా కేవలం వీటి కోసమే మూడు సంవత్సరాలు ఖర్చు పెట్టేసింది. సో హిట్ దక్కడం ద్వారా మరిన్ని అవకాశాలు వస్తాయి. హరిహర వీరమల్లు తనకు స్క్రీన్ స్పేస్ బాగానే దొరికిందని సమాచారం. పవన్ తో కనక కెమిస్ట్రీ క్లిక్ అయితే పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లనూ ఫ్యాన్స్ మళ్ళీ తనను చూసుకోవచ్చు.