రాంగ్ టైంలో రత్నం టార్గెట్ అయ్యారా

మూడు రోజుల్లో విడుదల కాబోతున్న హరిహర వీరమల్లు చివరి నిమిషం పనుల్లో నిర్మాత ఏఎం రత్నం చాలా బిజీగా ఉన్నారు. అయితే ఆయన్నుంచి తమకు పాత బాకీలు ఉన్న నేపథ్యంలో అవి తీర్చేందుకు డిస్ట్రిబ్యూటర్లు సహకరించాల్సిందిగా పలువురి ఫిర్యాదు మేరకు తెలంగాణ ఫిలిం ఛాంబర్ నుంచి బయటికొచ్చిన లేఖ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆ లెటర్ మీద ఉన్న తేదీ జూలై 15. అంటే అయిదు రోజులు ఆలస్యంగా రివీల్ చేశారు. ముందే షెడ్యూల్ చేసుకున్న ఇంటర్వ్యూలు సైతం ఇవ్వలేని టెన్షన్ లో ఉన్న రత్నం క్లోజ్ చేయాల్సిన ఏరియాలు ఇంకా ఉన్నాయి. ఈ టైంలో ఇబ్బంది పెట్టడం ఏమిటని పవన్ అభిమానుల ప్రశ్న.

ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం వచ్చిన బంగారం, ముద్దుల కొడుకు, పదేళ్ల క్రితం రిలీజైన ఆక్సీజెన్ గురించి ఇప్పుడు డిమాండ్లు పెట్టడం ఏమిటనేది ఫ్యాన్స్ లాజిక్. అవి నష్టాలు తెచ్చిన మాట వాస్తవమే. బకాయిలు కూడా ఉండొచ్చు. కానీ ఏఎం రత్నం వాటి తర్వాత చాలా సినిమాలకు నిర్మాతగా, సమర్పకుడిగా వ్యవహరించారు. మరి అప్పుడు ఇలాంటి విన్నపాలు కనిపించలేదు. ఇదే జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూల్స్ రంజన్ గత ఏడాది వచ్చింది. ఆ సమయంలో ఎలాంటి అడ్డంకులు ఏర్పడలేదు. అంతకు ముందు తమిళంలో కొన్ని హిట్ చిత్రాలు తీసిన రత్నం అందుబాటులోనే ఉంటూ వచ్చారనేది సూర్య ప్రొడక్షన్స్ వెర్షన్.

ఇది తీర్చుకోలేనంత పెద్ద సమస్య కాదు. ఈజీగా సెటిలైపోతుంది. కాకపోతే హరిహర వీరమల్లు పీకల మీద ఉన్నప్పుడు ఇలాంటివి చేయడం సబబేనా అనే కోణంలో చర్చ జరుగుతోంది. ప్రొడ్యూసర్ గా రత్నంకు హరిహర వీరమల్లు చాలా ప్రతిష్టాత్మకం. ఇప్పుడు ఇది హిట్ అయితేనే పార్ట్ 2కి కావాల్సిన డిమాండ్, బయ్యర్ల అడ్వాన్సులు వస్తాయి. బాహుబలి, కెజిఎఫ్ లాగా సీక్వెల్ క్రేజ్ ని క్యాష్  చేసుకోవచ్చు. ఆయన ధీమా కూడా అదే. అందుకే ముందు రోజు ప్రీమియర్లకు సిద్ధపడ్డారు. టికెట్ రేట్లు ఎక్కువనిపించినా దానికి పూర్తి న్యాయం చేసే విజువల్ గ్రాండియర్ కు హామీ ఇస్తున్నారు. ఈ నమ్మకానికి ఫలితం జూలై 23 అర్ధరాత్రి తెలిసిపోతుంది.