నిన్నటి దాకా బజ్ లేదు, ప్రమోషన్లు వీక్ గా ఉన్నాయని తెగ కలవరపడిన పవన్ కళ్యాణ్ అభిమానులు ఊరట చెందే పరిణామాలు జరుగుతున్నాయి. ముందు రోజు జూలై 23 రాత్రి 9. 30 గంటలకు వేయబోతున్న ప్రీమియర్లకు భారీ డిమాండ్ ఏర్పడుతోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల వైపు ఆన్ లైన్ బుకింగ్స్ పెట్టకుండానే ఫ్యాన్స్ థియేటర్ యాజమాన్యాల దగ్గర టికెట్లు కొనేసుకుంటున్నారట. అఫీషియల్ ధరే 600 రూపాయలు ఉండటంతో దానికి జిఎస్టి కలపగా ఏడు వందల దాకా ఒక్కో టికెట్ పలుకుతోంది. బ్లాక్ మార్కెట్ కి అవకాశం లేకపోయినా ముందు రోజే చూడాలనే తాపత్రయం బయట రేట్లను పెంచేలానే ఉంది.
నిజానికి నిర్మాత ఏఎం రత్నం చాలా పెద్ద రిస్క్ చేస్తున్నారు. పది రోజులకు టికెట్ రేట్ల పెంపుని తీసుకోవడం ఒక సాహసమైతే పవన్ కళ్యాణ్ సినిమాకు ముందు రోజే ప్రీమియర్ వేయడం మరింత రిస్క్. అసలే రాజకీయంగా పవన్ ని టార్గెట్ చేసుకున్న పార్టీ వర్గాలు కొన్ని సోషల్ మీడియా వేదికగా సినిమా మీద నెగటివిటీ తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట. రాత్రే షోలు వేస్తే తెల్లవారేలోపు ఇలాంటివి బాగా వైరలవుతాయి. కానీ రత్నం లెక్కలు వేరే ఉన్నాయి. బాహుబలి రేంజ్ లో అదిరిపోయే టాక్ వస్తుందని, అసలు ఏ మాత్రం ఊహించని స్థాయిలో కంటెంట్ తో మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తుందని అంటున్నారు.
ఇంకా పూర్తి స్థాయిలో ఏపీ ప్రీమియర్ల బుకింగ్స్ ఓపెన్ కాలేదు. ఒక్కో సెంటర్ కు జోడించుకుంటూ వెళ్తున్నారు. కొన్ని చోట్ల కలెక్టర్ల అనుమతులు ఆలస్యమవుతుండగా మరికొన్ని చోట్ల థియేటర్ అగ్రిమెంట్లలో జాప్యం వల్ల టైం డిసైడ్ కావడం లేదు. ఇవన్నీ రేపు మధ్యాన్నానికి కొలిక్కి వచ్చేస్తాయి. బుధవారం సాయంత్రం నుంచి హంగామా ఓ రేంజ్ లో ఉండబోతోంది. తెలంగాణకు సంబంధించిన జిఓ ఇంకా రాలేదు. పుష్ప 2 ఘటనని దృష్టిలో పెట్టుకుని స్పెషల్ షో పర్మిషన్ గురించి రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఒకవేళ పడితే మాత్రం సంధ్య 70 ఎంఎం బ్లాక్ టికెట్ కనీసం రెండు వేలు ఉండొచ్చని టాక్.
Gulte Telugu Telugu Political and Movie News Updates