సెలవు తీసుకున్న దిగ్గజ తార ‘బి సరోజాదేవి’

టాలీవుడ్ నట దిగ్గజం కోట శ్రీనివాసరావు పరమపదించిన వార్త హృదయాల బరువు తగ్గించక ముందే సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. లెజెండరీ నటి బి సరోజా దేవి కన్నుమూశారు. 1938 పోలీస్ ఉద్యోగి భైరప్ప, రుద్రమ్మలకు నాలుగో సంతానంగా జన్మించిన సరోజాదేవికి చిన్నప్పటి నుంచే నాట్యం, నటన మీద విపరీతమైన ఆసక్తి ఉండేది. నాటకాల్లో రాణించిన తండ్రి ప్రోత్సాహంతోనే సినిమాల్లోకి ప్రవేశించారు. 1955లో తొలి అవకాశం మహాకాళి కాళిదాసు రూపంలో దక్కింది. డెబ్యూనే ఘనవిజయం సాధించడంతో 17 ఏళ్ళ వయసు నుంచే బిజీ హీరోయిన్ గా మారిపోయారు. రెండేళ్లకే తెలుగులో ఎన్టీఆర్ సరసన పాండురంగ మహత్యం అవకాశం రావడంతో వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది.

తమిళంలో ఎంజిఆర్ తో నాన్ స్టాప్ గా 26 సూపర్ హిట్ సినిమాల్లో నటించిన అరుదైన ట్రాక్ రికార్డు సరోజాదేవి స్వంతం. అప్పట్లో ఈ జోడిని చూసి ఈర్ష్య పడిన తోటి కథానాయికలు ఎందరో తమ అక్కసుని వివిధ రూపాల్లో ప్రదర్శించడం పత్రికల్లో వచ్చేది. హిందీలో దిలీప్ కుమార్ తో నటించిన పైగామ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ రాజేంద్ర కుమార్, రాజ్ కపూర్, సునీల్ దత్ లాంటి దిగ్గజాలతో పని చేసే అదృష్టాన్ని కలిగించింది. ఇరవై ఆరు సంవత్సరాల పాటు 160కి పైగా సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఘనత ఈవిడకే దక్కింది. 2009లో రిలీజైన సూర్య ఘటికుడు సరోజాదేవి గారి చివరి సినిమా. ఆ తర్వాత నటన నుంచి రిటైర్ మెంట్ తీసుకున్నారు.

తెలుగులో సరోజాదేవికి ఎన్నో క్లాసిక్స్ ఉన్నాయి. భూకైలాస్, సీతారామ కళ్యాణం, జగదేకేవీరుని కథ, శ్రీ కృష్ణార్జున యుద్ధం, ఆత్మబలం, దాగుడుమూతలు, భాగ్య చక్రం, మాయని మమత, పండంటి కాపురం, శ్రీ రామాంజనేయ యుద్ధం, దానవీరశూరకర్ణ లాంటి ఎన్నో సూపర్ హిట్స్ లో భాగం పంచుకున్నారు. 1991లో రిలీజైన కృష్ణ అల్లుడు దిద్దిన కాపురం ఆవిడ నటించిన ఆఖరి తెలుగు సినిమా. కేంద్రప్రభుత్వం నుంచి పద్మశ్రీ – పద్మభూషణ్, తమిళనాడు కలైమామణితో పాటు ఎన్నో జాతీయ రాష్ట్ర పురస్కారాలు సరోజాదేవి అందుకున్నారు. భౌతికంగా నింగికేగారు కానీ ఆవిడ సినిమాల ద్వారా ఎప్పటికీ సజీవంగా ఉంటారు.