సీనియర్ మోస్ట్ హీరో కం కమెడియన్ రాజేంద్ర ప్రసాద్ తన ప్రసంగంలో దొర్లుతున్న తప్పుల వల్ల అవతలి వాళ్ళకే కాదు తనకు తాను ఎంత డ్యామేజ్ చేసుకుంటున్నారో చూసుకోవడం లేదు. ఎస్వి కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలో ఆలీని, రాబిన్ హుడ్ ఈవెంట్ లో డేవిడ్ వార్నర్ ని సంబోధించిన తీరు వివాదాలు తీసుకొచ్చింది. తర్వాత ఆయన క్షమాపణ చెప్పడం, ఇంకెప్పుడు రిపీట్ చేయనని హామీ ఇవ్వడం జరిగిపోయాయి. తాజాగా అమెరికాలో జరుగుతున్న తానా సభల్లో తనను తాను పొగుడుకునే క్రమంలో మళ్ళీ పొరపాట్లు చేయడం మరోసారి హాట్ టాపికయ్యింది. కాకపోతే ఈసారి ఇంటర్నేషనల్ లెవెల్లో.
స్పీచ్ లో భాగంగా మాట్లాడుతూ మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావు ప్రస్తావన తెచ్చిన రాజేంద్రప్రసాద్ ఆయన కేసులు, సూట్ కేసుల్లో ఉన్నప్పుడు తన సినిమాలు చూసే స్వాంతన పొందేవారని చెప్పడం అందరిని ఆశ్చర్యపరిచింది. అప్పుడెప్పుడో దివంగత సి నారాయణరెడ్డిగారు ప్రతి తెలుగు ఇంట్లో మంచం, కంచం లాగా రాజేంద్రప్రసాద్ ఉంటాడని గర్వంగా చెప్పడం కొంచెం సోత్కర్షగానే అనిపించింది. నిమ్మకూరులో ఎన్టీఆర్ ఇంట్లో తాను పుట్టడం , తానా అసోసియేషన్ పుట్టిన 1977లోనే తన కెరీర్ మొదలయ్యిందని చెప్పుకోవడం, సత్య సాయిబాబా జుత్తు మీద జోకు వేయడం చాలా మందికి ఇబ్బందికరంగా అనిపించింది.
కెరీర్ లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన రాజేంద్ర ప్రసాద్ ఇలా మాట్లాడ్డం కొత్త కాకపోయినా అంత పెద్ద వేదిక మీద ఇలాంటి స్పీచ్ ఇవ్వడం మీద సర్వత్రా కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్ సీనియర్ ఆర్టిస్టుల్లో చాలా బిజీగా ఉన్న వాళ్లలో ఈయన ముందు వరసలో ఉన్నారు. ఇలాంటి టైంలో మరింత హుందాగా ఉండాలి తప్ప అనవసరంగా వేరొకరు వేలెత్తి చూపేలా ఉండకూడదు. ఒకప్పుడు ఎన్నో క్లాసిక్స్ ఇండస్ట్రీకి అందించిన మాట వాస్తవమే కానీ అవి లేకపోతే పరిశ్రమ ఏమైపోయేదో అన్న రేంజ్ లో చెప్పుకోవడం సరికాదు. మొత్తానికి పెద్దాయన మరోసారి జనం నోళ్ళకు పని చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates