దివాలా వార్తలపై స్పందించిన రకుల్ భర్త

బాలీవుడ్ బడా బేనర్లలో ఒకటి.. పూజా ఎంటర్టైన్మెంట్స్. ఈ బేనర్ మీద దశాబ్దాల నుంచి భారీ చిత్రాలు నిర్మిస్తున్నరు వశు భగ్నాని. ఆయన తనయుడు జాకీ భగ్నాని ఓవైపు నటుడిగా సినిమాలు చేస్తూనే.. ఇంకోవైపు నిర్మాతగా తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్‌ను పెళ్లాడడంతో అతడి పాపులారిటీ ఇంకా పెరిగింది. ఐతే భగ్నాని కుటుంబానికి సినిమాల్లో ఈ మధ్య అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా ఫ్లాపులు ఎదురవుతున్నాయి. అందులోనూ గత ఏడాది పూజా ఎంటర్టైన్మెంట్స్ నుంచి వచ్చిన ‘బడేమియా చోటేమియా’ ఆ సంస్థ పునాదులను కదిలించేసింది. అక్షయ్ కుమార్-టైగర్ ష్రాఫ్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాపై రూ.350 కోట్ల బడ్జెట్ పెడితే అందులో మూడో వంతు కూడా వెనక్కి రాలేదు.

ఈ సినిమా దెబ్బకు భగ్నాని ఫ్యామిలీ ఆఫీసులు మూసేయడం, ఆస్తులు తనఖాపెట్టుకోవడం వరకు వెళ్లిందని వార్తలు వచ్చాయి. ఈ కుటుంబం పూర్తిగా దివాలా తీసినట్లు కూడా ప్రచారం జరిగింది. ‘బడేమియా చోటేమియా’తో తాము భారీ నష్టాలు చవిచూసిన మాట వాస్తవమే అని గతంలో అంగీకరించిన జాకీ భగ్నాని.. తాము దివాలా తీసినట్లు జరుగుతున్న ప్రచారాన్ని మాత్రం ఖండించాడు. జుహులో తాము కోల్పోయిన భారీ బిల్డింగ్‌ను తిరిగి సొంతం చేసుకున్నట్లు అతను వెల్లడించాడు. తాను ఆ బిల్డింగ్‌ను అమ్మేశానని, తన దగ్గర తిండి తినడానికి కూడా డబ్బులు లేవని, పారిపోయానని వార్తలు సృష్టిస్తున్నారని.. కానీ ఇవేవీ వాస్తవాలు కావని జాకీ స్పష్టం చేశాడు.

వార్తల్లో నిలిచిన ఆ భవనాన్ని తాను సొంతం చేసుకున్నానని.. తన గురించి వస్తున్న రూమర్లకు తాను ఎవరినీ నిందించదలుచుకోలేదని జాకీ వ్యాఖ్యానించాడు. ‘బడేమియా చోటేమియా’ సినిమా కోసం తీసుకున్న బ్యాంకు లోన్ల విషయంలో ఇబ్బంది పడ్డ మాట వాస్తవమని.. కానీ తాను ఆ లోన్లను తీర్చలేనని చాలామంది అనుకున్నారని.. కానీ అన్ని సమస్యల నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తున్నామని జాకీ తెలిపాడు. ఈ సినిమా విషయంలో దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్‌కు అవకాశం ఇవ్వడం తాము చేసిన పెద్ద తప్పని ఈ సందర్భంగా జాకీ అన్నాడు.