‘ఆదిపురుష్’ దర్శకుడికి మళ్లీ బ్యాండే

‘బాహుబలి’ తర్వాత హిమాలయమంత ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ప్రభాస్ డేట్లు ఇచ్చాడు. ఎంత కావాలంటే అంత ఖర్చు పెట్టే నిర్మాత దొరికాడు. అన్నింటికీ మించి భారతీయ ప్రేక్షకులు అమితంగా ఇష్టపడే కథల్లో ఒకటైన రామాయణం ఆధారంగా సినిమా చేసే అవకాశం వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ కొట్టడానికి ఇంతకంటే గొప్ప ఛాన్స్ ఇంకేముంటుంది? కానీ ఓం రౌత్ ఈ అవకాశాన్ని పూర్తిగా వృథా చేసుకున్నాడు. అందుబాటులో ఉన్న సాంకేతికతతో అద్భుతాలు చేయడానికి అవకాశమున్నా.. పనికి రాని క్రియేటివిటీ, దారుణమైన విజన్‌తో రామాయణ గాథను ఎంతగా చెడగొట్టాలో అంతా చెడగొట్టాడు. ఫలితంగా.. ‘ఆదిపురుష్’ ఇండియాస్ ఆల్ టైం డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది.

సినిమా ఫెయిలవడం ఒకెత్తయితే.. రామాయణాన్ని చెడగొట్టాడంటూ ఓం రౌత్ మీద వచ్చిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు. ‘ఆదిపురుష్’ రిలీజ్ తర్వాత ఏ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నా.. పురాణ పురుషుల కథలను బాగా చూపించినా.. ఓం రౌత్ సోషల్ మీడియాకు టార్గెట్ అయిపోతున్నాడు. హనుమాన్ అనే చిన్న బడ్జెట్ సినిమాతో ప్రశాంత్ వర్మ అద్భుతాలు చేసినపుడు.. ప్రభాస్ నటించిన ‘కల్కి’లో మహాభారతం కాన్సెప్ట్‌ను నాగ్ అశ్విన్ అద్భుతంగా చూపించినపుడు.. ఓం రౌత్‌ను తిట్టుకోని అభిమానులు లేరు. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే తరచుగా ఓం రౌత్‌ మీద పడిపోతుంటారు సోషల్ మీడియాలో.

ఇప్పుడు మరోసారి రౌత్ వాళ్లకు టార్గెట్ అయిపోయాడు. రణబీర్ కపూర్, సాయిపల్లవి, యశ్ కాంబినేషన్లో నితీశ్ తివారి రూపొందిస్తున్న ‘రామాయణం’ గ్లింప్స్ ఈ రోజు రిలీజైంది. అది చూసిన వాళ్లందరితోనూ వావ్ అనిపిస్తోంది. ఇలాంటి ఎపిక్ స్టోరీలకు విజువల్ ఎఫెక్ట్స్‌ను ఎలా వాడుకోవాలో.. గ్లింప్స్‌తో ఒక డివైన్ ఫీలింగ్ ఎలా తీసుకురావాలో నితీశ్ అండ్ టీం ఈ గ్లింప్స్‌లో చూపించింది.

నిజంగానే ఒక ఎపిక్ మూవీ చూడబోతున్న సంకేాతాలను ఈ గ్లింప్స్ ఇచ్చింది. ఇది చూసి ‘ఆదిపురుష్’ను రౌత్ అండ్ టీం ఎలా చెడగొట్టిందో మరోసారి గుర్తు చేసుకుంటున్నారు నెటిజన్లు. మున్ముందు ఇలాగే మంచి కంటెంట్ ఇచ్చేకొద్దీ రౌత్‌ను నెటిజన్లు ఆడుకోవడం గ్యారెంటీగా కనిపిస్తోంది. ఓం రౌత్ ఎంత గొప్ప అవకాశాన్ని వృథా చేశాడో ‘రామాయణం’ టీం రుజువు చేసేలాగే కనిపిస్తోంది.