క్షమాపణ చెప్పిన దిగ్గజ దర్శకుడు

సినీ పరిశ్రమలో నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవడం అంత సులభం కాదు. ఫ్లాప్ ఇచ్చినా సరే అది తమ తప్పు కాదని, ఏవేవో కారణాల వల్ల పరాజయం పాలయ్యామని, నిర్మాతలు లాభ పడ్డారని సాకులు చెప్పే దర్శకులను నిత్యం చూస్తూ ఉంటాం. కానీ లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం ఆ కోవలోకి రారు. థగ్ లైఫ్ పరాజయం గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ తమ నుంచి నాయకుడు లాంటి క్లాసిక్ ఆశించిన వాళ్ళను క్షమాపణ కోరుతున్నామని, దాని కంటే తక్కువ స్థాయి సినిమా ఇచ్చే ఉద్దేశం ఎంత మాత్రం లేదని, అసలలా ఎందుకు చేస్తామని, అంచనాల ఒత్తిడిలో అనుకోని ఫలితాన్ని చవి చూడాల్సి వచ్చిందని ఒప్పుకున్నారు.

పెద్ద మనిషి తరహా అంటే ఇదేనేమో. నిజానికి మణిరత్నంకి సారీ చెప్పాల్సిన అవసరం లేదు. డిజాస్టర్లు అందరూ ఇస్తారు. కానీ దాన్ని హుందాగా ఒప్పుకోవడం అంటే మాటలు కాదు. పొన్నియిన్ సెల్వన్ తో తమిళంలో కంబ్యాక్ అయ్యారని భావించిన మణిరత్నం ఫ్యాన్స్ థగ్ లైఫ్ చూసి తీవ్రంగా నిరాశ చెందారు. ఏదో ఏవరేజ్ గా ఆడినా ఇంత బాధ ఉండేది కాదేమో కానీ మరీ మధ్యాన్నం ఆటకే ఆడియన్స్ తిరస్కరించడం ఇలాంటి కాంబోకి జరగాల్సింది కాదు. పూర్తిగా భిన్నమైనది ఏదో అందించాలనే తాపత్రయంలో ఎంతటి వారికైనా తప్పటడుగులు పడతాయని చెప్పడానికి థగ్ లైఫ్ మంచి ఉదాహరణ.

శింబుతో తన తర్వాతి సినిమా చేయబోతున్న మణిరత్నం ఈసారి గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ కి దూరంగా ఒక కూల్ లవ్ ఎంటర్ టైనర్ ప్లాన్ చేశారని చెన్నై టాక్. తొలుత నవీన్ పోలిశెట్టి పేరు వినిపించింది కానీ తర్వాత అది గాసిప్ అని తేలిపోయింది. శింబు మూడోసారి ఈ క్లాసిక్ డైరెక్టర్ తో పని చేయబోతున్నాడు. ఏది ఏమైనా థగ్ లైఫ్ ప్రభావం కేవలం మణిరత్నం మీదే కాదు కమల్ హాసన్ మీద కూడా బలంగా పడింది. కర్ణాటక రిలీజ్ బ్యాన్, ఫ్లాప్ వల్ల నష్టాలు, ఇండియన్ 2 తర్వాత రెండో డిజాస్టర్ పడటం ఇవన్నీ దెబ్బ మీద దెబ్బ కొట్టాయి. అందుకే కంబ్యాక్ కోసం వీరధీర శూరన్ దర్శకుడు అరుణ్ కుమార్ ని ఎంచుకున్నట్టు తెలిసింది.