కమ్ముల గురించి ధనుష్‌కు ఏమీ తెలియకుండానే..

తెలుగులో గొప్ప అభిరుచి ఉన్న దర్శకుల్లో శేఖర్ కమ్ముల ఒకరు. మొన్న రాజమౌళి అన్నట్లు.. తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి విభిన్న శైలిలో సినిమాలు తీసే దర్శకుడాయన. ఆనంద్, గోదావరి, లీడర్, ఫిదా.. ఇలా కల్ట్ క్లాసిక్స్ ఇచ్చిన ఈ దర్శకుడు.. ఇప్పుడు ‘కుబేర’ అనే మరో కొత్త ప్రయత్నం చేశాడు. ఈ సినిమా ప్రోమోలు చూస్తే ఇప్పటిదాకా ట్రై చేయనిది ఆయన ప్రయత్నించాడని అర్థమవుతోంది. తమిళంలో గొప్ప నటుడిగా, కథల ఎంపికలో మంచి టేస్టున్న వ్యక్తిగా పేరున్న ధనుష్‌ను ఒప్పించి సినిమా చేయడంలోనే శేఖర్ విజయం దాగి ఉంది. ఐతే ధనుష్.. కేవలం శేఖర్ పేరు చూసి ఈ కథను ఓకే చేయలేదట.

‘కుబేర’ కథ విన్నపుడు అసలు శేఖర్ గురించి తనకేమీ తెలియదట. ఈ కథ నచ్చి, సినిమా ఓకే చేశాకే శేఖర్ గురించి వేరే వాళ్లను అడిగి తెలుసుకున్నానని.. తర్వాత ఆయన సినిమాలు చూశానని.. అప్పుడే ఆయన గొప్పదనం తెలిసిందని చెన్నైలో జరిగిన ‘కుబేర’ ప్రి రిలీజ్ ఈవెంట్లో ధనుష్ వెల్లడించాడు. ముందు శేఖర్ కమ్ముల తనకు ‘కుబేర’ లైన్ మాత్రమే చెప్పాడని.. అది నచ్చి సినిమా చేస్తానని చెప్పానని.. తర్వాత ఆయన రెండేళ్ల పాటు కనిపించలేదని.. ఈ రెండేళ్లు కథ మీద పని చేస్తూనే ఉన్నాడని.. బ్రహ్మాండండగా స్క్రిప్టు తయారు చేసుకుని వచ్చాడని ధనుష్ తెలిపాడు.

తనకు లైన్ చెప్పి వెళ్లాక శేఖర్ గురించి ఎవరిని అడిగినా ఆయన గొప్ప దర్శకుడని చెప్పారన్నాడు ధనుష్. ఫుల్ నరేషన్ విన్నాక ఇది చాలా పెద్ద స్కేల్ ఉన్న సినిమాగా కనిపించిందని.. ఎంతో ఊహించుకుని తొలి రోజు షూటింగ్‌కు వెళ్తే.. తిరుపతిలో నడి రోడ్డు మీద ఎండలో నిలబెట్టి అమ్మా అని అడుక్కునేలా చేశాడంటూ తన పాత్ర గురించి ధనుష్ చమత్కరించాడు. తాను ‘కుబేర’ విషయంలో చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నానని.. తనను నమ్మి సినిమా చూడాలని ప్రేక్షకులకు ధనుష్ పిలుపునిచ్చాడు. ఇక నాగార్జునతో పని చేయడం గొప్ప అనుభవం అన్న ధనుష్.. ఆయన సినిమాల్లో తనకు ఫలానాది ఇష్టం అంటూ మీడియాలో రాస్తున్నారని.. ఇలా తన గురించి లేనివి రాస్తుంటారని అన్న ధనుష్.. తనకు శివ, గీతాంజలి చాలా ఇష్టమని నాగ్ ముందు వెల్లడించాడు.