దేశంలోనే ఖరీదైన సినిమా అల్లు అర్జున్ 22

రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే మొదలుపెట్టుకున్న అల్లు అర్జున్ 22 తాలూకు ఎగ్జైట్ మెంట్ అభిమానుల్లో మాములుగా లేదు. అనౌన్స్ మెంట్ కోసం వదిలిన ప్రోమో, దీపికా పదుకునే పరిచయం తాలూకు వీడియో జనంలో విపరీతమైన ఆసక్తిని పెంచాయి. అందులోనూ పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న సినిమా కావడంతో నార్త్ ఆడియన్స్, ట్రేడ్ వర్గాలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాయి. మూడు ఊహించని పాత్రల్లో బన్నీ ట్రిపుల్ రోల్ చేయబోయే ఈ మూవీలో దీపికా కాకుండా మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ముంబైలో జరుగుతున్న షెడ్యూల్ పక్కా ప్రణాళికతో జరుగుతోంది.

ఈ ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచి దర్శకుడు అట్లీ బయట మీడియాకి దొరకలేదు. తాజాగా సత్యభామ యునివర్సిటి నుంచి డాక్టరేట్ అందుకున్న సందర్భంగా ఏఏ 22 గురించి మాట్లాడాడు. ఇండియాలోనే ఇప్పటిదాకా తెరకెక్కనంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా ఉంటుందని, చాలా పెద్ద ఎత్తున కల కంటున్నానని, బడ్జెట్ ఎంతనేది ఇంకా డిసైడ్ కాలేదని, కానీ కొత్త టెక్నాలజీలు దీని కోసం పరిచయం చేయబోతున్నామని ఓ రేంజ్ లో ఎలివేషన్లు ఇచ్చాడు. విడుదల ఎప్పుడనేది నిర్మాత తీసుకునే నిర్ణయమని, తీయడం వరకే తన బాధ్యత అంటూ ఈ విశేషాలను అడిగినవాళ్లతో పంచుకున్నాడు.

దీన్ని బట్టి అనుకున్న దానికన్నా చాలా పెద్ద స్కేల్ మీద ఏఏ 22 రూపొందుతోందనే క్లారిటీ వచ్చేసింది. దేశంలోనే కాస్ట్లీ ఫిలిం అని చెప్పడం చూస్తే ఆర్ఆర్ఆర్, బాహుబలిని దాటిపోయేలా ఉంది. కాకపోతే మహేష్ బాబు రాజమౌళిల ఎస్ఎస్ఎంబి 29 ముందు వస్తుందా లేక ఏఏ 22 ఫస్ట్ రిలీజవుతుందా అనే దాన్ని బట్టి ఎవరిది ఎక్కువవుతుందనేది డిసైడ్ చేయొచ్చు. జవాన్ బ్లాక్ బస్టర్ తర్వాత మంచి ఊపు మీదున్న అట్లీ ఈసారి ఐకాన్ స్టార్ కు ఎలాంటి కంటెంట్ ఇస్తాడోనని మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అత్యధిక శాతం ఫారిన్ నిపుణులు పని చేస్తున్న ఈ విజువల్ వండర్ రిలీజ్ 2027లో ఉండొచ్చు.