బీటలు వారుతున్న స్పై యూనివర్స్ ?

పదమూడేళ్ల క్రితం ఏక్ తా టైగర్ కు వచ్చిన బ్రహ్మాండమైన స్పందన యష్ రాజ్ ఫిలింస్ ని మరిన్ని స్పై మూవీస్ తీసేందుకు  ప్రేరేపించింది. టైగర్ జిందా హైతో మొదలుపెట్టి పఠాన్ దాకా అధిక శాతం సక్సెస్ అయినవే. అయితే టైగర్ 3 నుంచి హెచ్చరికలు మొదలయ్యాయి. ట్విస్టులు పక్కనపెడితే అన్ని కథల్లో ఒకటే పాయింట్ ఉండటం, అది కూడా పాకిస్థాన్ ని శత్రువుగా చూపించడమో లేదా అక్కడి అధినేతలు మంచివాళ్లనే స్థాయిలో కలరింగ్ ఇవ్వడమో, కారణం ఏదైతేనేం ప్రేక్షకుల్లో వీటి పట్ల ఆసక్తి తగ్గుతున్న వైనం కనిపించింది. వీటిని ఇక్కడితో ఆపేయాలని మూవీ లవర్స్ కోరుతూ వచ్చారు.

వార్ 2 కూడా ఇదే తరహా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన మల్టీస్టారరే. కాకపోతే జూనియర్ ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ లాంటి అరుదైన కలయిక కావడంతో క్రేజ్ వచ్చింది. టీజర్ కు మిశ్రమ స్పందన దక్కినా రిలీజ్ నాటికి అంచనాలు వేరే స్థాయికి వెళ్ళిపోతాయనేది నిర్మాత ఆదిత్య చోప్రా నమ్మకం. ఇదిలా ఉండగా వందల కోట్ల బడ్జెట్ తో ప్లాన్ చేసుకున్న టైగర్ వర్సెస్ పఠాన్ ని యష్ సంస్థ డ్రాప్ చేసినట్టు ముంబై రిపోర్ట్. షారుఖ్, సల్మాన్ కలిసి ఫుల్ లెన్త్ మూవీ చేయడం అంచనాలు పెంచుతుంది కానీ దానికి స్పై నేపథ్యం సరికాదని భావించడం వల్ల పక్కనపెడుతున్నారని తెలిసింది జాన్ అబ్రహంతో అనుకున్న జిమ్ కూడా ఆపేశారట.

వార్ 2 తర్వాత వచ్చే అలియా భట్ అల్ఫాతో ఈ సిరీస్ కు బ్రేక్ వేస్తారని తెలిసింది. కొత్త దర్శకులతో వేరే కథలు తయారు చేయించి అప్పుడు గూఢచారి నేపధ్యాన్ని కొనసాగించే ఆలోచనలో ఉన్నారట. సిద్దార్థ్ ఆనంద్, అయాన్ ముఖర్జీ, కబీర్ ఖాన్ లాంటి సీనియర్లను పక్కనపెట్టి ఫ్రెష్ టాలెంట్స్ ని ఎంకరేజ్ చేస్తారట. అయితే వార్ 2 అయ్యాక జూనియర్ ఎన్టీఆర్ తో మరో యాక్షన్ మూవీ ప్లాన్ చేస్తున్న ఆదిత్య చోప్రా దాన్ని నిజంగా ముందుకు తీసుకెళ్తారా లేదా అనేది వేచి చూడాలి. తారక్ ప్రశాంత్ నీల్, దేవర 2తో ఇంకో రెండు సంవత్సరాలు దొరికేలా లేడు. ఆలోగా ఏమేం మార్పులు జరుగుతాయో.