జూన్ నెల వారానికో ప్యాన్ ఇండియా సినిమాతో కళకళలాడుతుందనుకుంటే దానికి భిన్నంగా థగ్ లైఫ్ బోణీ డిజాస్టర్ కావడం, జూన్ 12 రావాల్సిన హరిహర వీరమల్లు వాయిదా పడటం ఇండస్ట్రీ వర్గాలకు షాకిచ్చాయి. ఇక నుంచి థియేటర్లు జనంతో నిండిపోతాయనుకుంటే దానికి భిన్నంగా ఇంకో రెండు వారాలు మూసేస్తే నయమనే భావనలో ఎగ్జిబిటర్లు ఉన్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే పర్సెంటేజ్ లు, రెంట్లు తర్వాత అసలు ఈ వ్యాపారమే వద్దనుకుంటున్న వాళ్ళ లిస్టు పెరిగేలా ఉంది. ఈ నేపథ్యంలో జూన్ 20 వైపు అందరి దృష్టి వెళ్తోంది. కుబేర విడుదల కాబోతున్న నేపథ్యంలో భారమంతా దాని మీదే ఉంది.
నా సామిరంగ తర్వాత నాగార్జున తెరమీద కనిపించనున్న సినిమా ఇదే. ఏడాదిన్నర పైగా గ్యాప్ రావడంతో అక్కినేని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ధనుష్ మెయిన్ హీరో అయినప్పటికీ ప్రాధాన్యత పరంగా ఇద్దరినీ బాలన్స్ చేసి ఉంటారనే నమ్మకం ట్రైలర్ తో వచ్చింది. అందులోనూ కథను నిజాయితీగా చూపించే శేఖర్ కమ్ముల దర్శకుడు కాబట్టి అది మరింత ఎక్కువగా ఉంది. రష్మిక మందన్న, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, డబ్బు క్రైమ్ తో ముడిపడిన విభిన్నమైన నేపథ్యం, తదితరాలు ఆసక్తిని పెంచుతున్నాయి. అందులోనూ రాజీ లేకుండా ఎక్కువ కాలం నిర్మాణం జరుపుకున్న చిత్రమిది.
ఇప్పుడు టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఊపిరి ఊదాల్సిన బాధ్యత కుబేర మీద ఉంది. ఒక బిచ్చగాడు కోటీశ్వరుడు అయ్యే క్రమంలో ఎదురయ్యే సామజిక రాజకీయ పరిస్థితుల ఆధారంగా శేఖర్ కమ్ముల దీన్ని తెరకెక్కించారు. పాటలు వేటికవే వైవిధ్యంగా అనిపిస్తున్నాయి. కంటెంట్ కనక క్లిక్ అయితే కుబేరకు వసూళ్ల వర్షం ఖాయం. క్లాస్ టచ్ ఎక్కువగా ఉండే శేఖర్ కమ్ముల ఈసారి కమర్షియల్, యాక్షన్ అంశాలను కూడా జోడించాడు. ధనుష్ లాంటి పెర్ఫార్మర్ దొరికాడు కాబట్టి పీక్స్ కంటెంట్ చూడొచ్చని మూవీ లవర్స్ కోరిక. మరి అది ఎంత వరకు నెరవేరుతుందో ఇంకో రెండు వారాల్లో తేలనుంది.