సినిమా ఫలితాలు ఎవరి చేతిలోనూ ఉండవు, నిజమే. కొన్నిసార్లు బాగా తీసినవి కూడా బాక్సాఫీస్ దగ్గర ఫెయిలవుతాయి. కానీ ప్రేక్షకులు వాటిని గుర్తించి గౌరవిస్తారు. ఉదాహరణకు ఖలేజాని చెప్పుకోవచ్చు. కానీ తీసికట్టు కంటెంట్ తో వస్తే మాత్రం ఆడియన్స్ ఎంత నిర్దయగా ఉంటారో చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసిన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన కల్ట్ దర్శకులు ఇప్పుడు షో మధ్యలోనే లేచి వెళ్లిపోయే స్థాయికి దిగిపోయారంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి. నిన్న విడుదలైన థగ్ లైఫ్ మీద యునానిమస్ నెగటివ్ టాక్ కనిపిస్తోంది. కనీసం పర్వాలేదని చెబుతున్న బ్యాచ్ సోషల్ మీడియాలోనూ కనిపించలేదు.
కేవలం కాంబినేషన్ క్రేజ్ మీద బిజినెస్ చేసి, లెక్కలేనంత ఖర్చుతో ప్రమోషన్లు చేసి తీరా థియేటర్లో కూర్చున్న తర్వాత దర్శకుడు మణిరత్నం చూపించిన నీరసం అంతా ఇంతా కాదు. దళపతి, నాయకుడు, రోజా, బొంబాయి తీసింది ఈయనేనా అని ఎవరికైనా సందేహం రాకపోతే ఒట్టు. జెంటిల్ మెన్, భారతీయుడు, ఒకే ఒక్కడు, ప్రేమికుడు లాంటి కల్ట్ క్లాసిక్స్ ఇచ్చిన ఇండియన్ స్పిల్ బర్గ్ శంకర్ వరసగా ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ రూపంలో మర్చిపోలేని పీడకలలను కానుకగా ఇచ్చారు. పాటలకు, ఫైట్లకు వందల కోట్లు ఖర్చు పెట్టించినా దానికి తగ్గ అవుట్ ఫుట్ కనీసం సగం కూడా ఇవ్వలేకపోతున్నారు.
ఇక మురుగదాస్ ది కూడా ఇదే కథ. గజిని, తుపాకీ లాంటి అల్టిమేట్ మూవీస్ ఇచ్చిన ఇతనా సల్మాన్ ఖాన్ సికందర్ తీసిందని అనుకోని వాళ్ళు లేరు. అంతకు ముందు రజనీకాంత్ పిలిచి దర్బార్ ఇచ్చినా దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోయారు. ఇప్పుడాయన చివరి ఆశ శివ కార్తికేయన్ మదరాసినే. కోలీవుడ్ లో బలమైన ప్రభావం చూపించిన ఇలాంటి దర్శకులు ఇంత నాసిరకంగా దిగిపోవడం ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. తమిళ పరిశ్రమకు చెందినప్పటికీ ఇతర భాషల్లోనూ భారీ ఫాలోయింగ్ తెచ్చుకున్న ఈ దిగ్గజాలు ఇప్పుడు ట్రోలింగ్ కి టార్గెట్ కావడం విచారకరం. కంబ్యాక్ అవ్వడం విధిరాతలో కాదు వాళ్ళ చేతల్లోనే ఉంది.