జూన్ 27 విడుదల కాబోతున్న కన్నప్ప కోసం ప్రమోషన్ల పరంగా విష్ణు అన్ని అస్త్రాలను వాడబోతున్నాడు. హరిహర వీరమల్లు వాయిదా వార్తల నేపథ్యంలో మళ్ళీ ఏమైనా మార్పు ఉండొచ్చేమోననే ఊహాగానాలకు చెక్ పెడుతూ అలాంటిదేమీ లేదని, ఈసారి టైంకి రావడం పక్కాని హామీ ఇస్తున్నాడు. త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రభాస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని సమాచారం. ఇదిలా ఉండగా కన్నప్ప ప్రమోషన్ల సందర్భంగా మంచు విష్ణు చెబుతున్న సంగతులు ఆసక్తికరంగా ఉన్నాయి. ముఖ్యంగా విఎఫ్ఎక్స్ గురించి షాకింగ్ అనిపించేలా కొన్ని విషయాలు చెప్పాడు.
కన్నప్ప విజువల్ ఎఫెక్ట్స్ విష్ణుని తీవ్రమైన టార్చర్ పెట్టాయి. అసమర్థుడైన ఒక సూపర్ వైజర్ ని పెట్టుకోవడం వల్ల ప్రాజెక్టు ఏకంగా ఏడాది ఆలస్యమైపోయింది. అప్పుడే తాను చేస్తున్న పొరపాటు ఏంటో విష్ణుకి అర్థమైపోయింది. ఆ తర్వాత ముంబై, చెన్నై, హైదరాబాద్ తో పాటు విదేశాల సంస్థలు కలిపి మొత్తం ఎనిమిది కంపెనీలకు ఈ పనులు అప్పజెప్పాడు. ఈ ఇష్యూ వల్ల విఎఫ్ఎక్స్ నిపుణుల అవసరం చాలా ఉందని గుర్తించిన విష్ణు త్వరలో మోహన్ బాబు యూనివర్సిటీలో మూడు సంవత్సరాల సిజికి సంబంధించిన డిగ్రీ కోర్సుని ప్రారంభించబోతున్నారు. దీని వల్ల నిపుణుల కొరత కొంతైనా తగ్గించవచ్చని ప్లాన్.
విఎఫెక్స్ వల్ల జరిగిన నష్టమే సుమారు 15 నుంచి 20 కోట్ల దాకా ఉండొచ్చని విష్ణు చెబుతున్న మాట. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగార్వల్, శరత్ కుమార్ లాంటి క్రేజీ క్యాస్టింగ్ తో పాటు మోహన్ బాబు ప్రత్యేక పాత్ర పోషిస్తున్న కన్నప్ప థియేటర్ లో చూశాక మర్చిపోలేని ఎక్స్ పీరియన్స్ ఇస్తుందని విష్ణు భరోసా ఇస్తున్నాడు. ఎక్కడా రాజీ పడలేదని, హార్డ్ రిస్క్ ఇంకా దొరకలేదు కానీ దాన్ని వాడుకుని సినిమాని చంపే ప్రయత్నాలు సఫలం కావని హామీ ఇచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా ఇంకో ఇరవై మూడు రోజుల్లో రిలీజ్ కాబోతున్న కన్నప్ప ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు.