=

పచ్చి నిజాలు మాట్లాడిన బండ్ల గణేష్

నిన్న జరిగిన ప్రముఖ దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి జన్మదినోత్సవ వేడుకల్లో బండ్ల గణేష్ ప్రసంగం ఆకట్టుకోవడమే కాదు అందరినీ ఆలోచింపజేసేలా మారింది. ఇప్పటి దర్శకులు, హీరోల వర్కింగ్ స్టైల్ గురించి చురకలు వేస్తూ నాలుగేళ్లకు ఒక సినిమా తీయడం ఏమిటని, అప్పట్లో వినోదంని కేవలం ఎనభై నుంచి తొంభై రోజుల్లో తీసి విడుదల చేసిన ఘనత ఎస్వికేకి దక్కుతుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తనకున్న స్వంత థియేటర్ కు వెళ్లి బ్యాలన్స్ షీట్ చెక్ చేసుకుంటే 40 లక్షలు నష్టం తేలిందని, ఇది కేవలం సరైన చిత్రాలు రాకపోవడం వల్ల, డైరెక్టర్లు వేగం తగ్గించడం వల్లేనంటూ తనదయిన రీతిలో అనాలిసిస్ చేశారు.

ఆలోచిస్తే బండ్ల గణేష్ మాట్లాడింది అక్షర సత్యం. ప్యాన్ ఇండియా ఉచ్చులో పడి టాప్ స్టార్ నుంచి జూనియర్ హీరో దాకా అందరూ రెండేళ్లకో సినిమా చేయడమే పెద్ద ఘనతగా ఫీలవుతున్నారు. ఇటు దర్శకులు సైతం అతి జాగ్రత్త పడి క్వాలిటీ పేరుతో ఏళ్లకేళ్లు వృథాగా ఖర్చు పెడుతున్నారు. పోనీ వీళ్లంతా బ్లాక్ బస్టర్లు సాధిస్తున్నారా అంటే అదీ లేదు. ఇప్పటికీ సక్సెస్ రేట్ పది శాతం లోపే. గణేష్ చెప్పిన ఎస్వి కృష్ణారెడ్డి ఉదాహరణనే తీసుకుంటే మాయలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు, శుభలగ్నం, మావిచిగురు, దీర్ఘసుమంగళీభవ, యమలీల లాంటి వన్నీ తక్కువ రోజుల్లో తక్కువ బడ్జెట్ తో రూపొందిన అద్భుతమైన బ్లాక్ బస్టర్లు.

ఈ దిశగా అందరూ సీరియస్ గా ఆలోచించాల్సిన టైం వచ్చింది. ఏడాదికి నాలుగైదు భారీ సినిమాలు థియేటర్ల ఫీడింగ్ కు సరిపోవడం లేదు. ఒక రెండు మూడు వారాలు హౌస్ ఫుల్స్ పడి తర్వాత అవి వెళ్ళిపోయాక తిరిగి కరెంట్ బిల్లు కట్టలేనంత సొమ్ము కూడా రావడం లేదని లబోదిబోమనే పరిస్థితి వస్తూనే ఉంది. స్పీడ్ పెంచాలని అందరూ పైకి చెప్పుకోవడమే తప్పించి దాన్ని ప్రాక్టికల్ గా చేసి చూపిస్తున్న వాళ్ళు ఇటు హీరోలు అటు దర్శకుల్లో వేళ్ళ మీద లెక్కబెట్టవచ్చు. బండ్ల గణేష్ అన్నది ఎంత సీరియస్ ఇష్యూనో లోతుగా ఆలోచిస్తే అర్థమవుతుంది. ఆ దిశగా మార్పు రావాలనేది సగటు సినీ ప్రియుల ఆకాంక్ష.