నిన్న 2014 నుంచి 2024 వరకు పదేళ్ల కాలానికి ప్రతి ఏడాదికి మూడు ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటి గురించి ఇండస్ట్రీలోనే కాదు ప్రేక్షకుల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతన్నాయి. ముఖ్యంగా కొన్ని మంచి సినిమాలకు గుర్తింపు దక్కలేదనే కామెంట్స్ సర్వత్రా వినిపిస్తున్నాయి. 2014 లిస్టులో అక్కినేని లాస్ట్ మూవీ ‘మనం’ లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం. రొటీన్ కమర్షియల్ ఎంటర్ టైనరైన అల్లుడు శీనుకిచ్చిన మూడో స్థానం కూడా మనంకు ఇవ్వకపోవడం పట్ల క్రమంగా విమర్శలు వినిపిస్తున్నాయి.
సెన్సార్ డేటుతో పాటు తెలంగాణ ఏర్పాటు తేదీని పరిగణనలోకి తీసుకోవడం వల్లే మనం మిస్సయ్యిందనే వర్షన్ గద్దర్ సభ్యుల నుంచి వినిపిస్తోంది. ఏఎన్ఆర్ చివరి సినిమా, అందులోనూ విక్రమ్ కె కుమార్ అద్భుతమైన స్క్రీన్ ప్లేతో దాన్ని నడిపించిన విధానం మనంని క్లాసిక్ గా మార్చింది. రిలీజ్ డేట్ నే పరిగణనలోకి తీసుకోవాలనేది ఏఎన్ఆర్ అభిమానుల డిమాండ్. ఇక 2019లో వచ్చిన సైరా నరసింహారెడ్డి సైతం పురస్కారానికి నోచుకోలేదు. మహర్షిలో ఎంత సందేశం ఉన్నా అది కమర్షియల్ మూవీనే. కానీ రాయలసీమ యోధుడి మీద తీసిన సైరా ఏ విధంగా ఉత్తమ చిత్రం కాలేదని మెగా ఫ్యాన్స్ క్వశ్చన్.
జ్యురి సభ్యుల వ్యక్తిగత అభిప్రాయాలు, ప్రాధాన్యతలకు అనుగుణంగా గద్దర్ అవార్డుల ఎంపిక జరిగిందనే గుసగుసలు పరిశ్రమలో వినిపిస్తున్నాయి. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన దసరా, విరాట పర్వం లాంటి వాటిని సైతం గుర్తించకపోవడం ఇంకో ట్విస్టు. అవి విమర్శకులను సైతం మెప్పించిన సినిమాలు కదా. హాయ్ నాన్న చోటు దక్కించుకోకపోవడం ఇంకో షాక్. నంది అవార్డులు ఉన్నప్పుడు కూడా ఇలాంటి డిస్కషన్లు జరిగేవి కానీ ఒకప్పుడు వీటికి బాక్సాఫీస్ కలెక్షన్లను ప్రామాణికంగా తీసుకునే వాళ్ళు కాదు. కానీ గద్దర్ లిస్టు చూస్తుంటే మాత్రం కమర్షియల్ స్టేటస్ పరిగణనలోకి తీసుకున్నట్టు కనిపిస్తోంది.