ఒకప్పుడు మణిరత్నం ఒకసారి చేసిన హీరోతో మళ్ళీ చేసేందుకు ఇష్టపడే వాళ్ళు కాదు. నాయకుడు తర్వాత కమల్ హాసన్ కాంబో కార్యరూపం దాల్చడానికి ముప్పై ఎనిమిది సంవత్సరాలు పట్టింది. దళపతి అయ్యాక రజనీకాంత్ తో మళ్ళీ కుదరనేలేదు. గీతాంజలిలో నాగార్జునని గొప్పగా చూపించిన ఆ కల్ట్ దర్శకుడు మళ్ళీ తెలుగు స్టార్లను పలకరించలేదు. బొంబాయిని విక్రమ్ వదులుకున్నాడు కాబట్టి అరవింద్ స్వామిని ఆ పాత్ర వరించింది కానీ లేదంటే ఆ కలయికలో రోజా ఒకటే మిగిలేది. తర్వాత క్రమంగా మణిరత్నం ఈ కట్టుబాటుని పక్కన పెట్టారు. మాధవన్ పరిచయమయ్యాక రిపీట్ హీరో ఫార్ములాని తీసుకున్నారు.
సఖి, యువ, అమృత ఇలా మూడు మణిరత్నం సినిమాల్లో కథానాయకుడిగా నటించిన ఘనత మొదట మాధవన్ కే దక్కింది. తర్వాత విక్రమ్ విలన్ (రావణన్), పొన్నియిన్ సెల్వన్ 1- 2 భాగాలతో ఆ సెంటిమెంట్ ని తాను తీసుకున్నాడు. ఇప్పుడు ఈ లిస్టులో శింబు చేరబోతున్నాడు. నవాబ్, దగ్ లైఫ్ తర్వాత ముచ్చటగా మూడో సినిమాని మణిరత్నం శింబుకి ఇవ్వబోతున్నట్టు చెన్నై టాక్. నిజానికి ఈ కథను ముందు నవీన్ పోలిశెట్టికి చెప్పారట. కానీ తను సున్నితంగా తిరస్కరించాడనే టాక్ ఉంది. ఇదే విషయాన్ని మణిరత్నంని ఒక ఇంటర్వ్యూలో అడిగితే అలాంటిదేమి లేదని, నవీన్ తో సినిమా పుకారని కొట్టి పారేశారు.
నిజమెంతనేది పక్కనపెడితే మణిరత్నం శింబు కాంబోలో ప్రాజెక్టు లాకైనట్టుగానే కనిపిస్తోంది. హీరోయిన్ గా రుక్మిణి వసంత్ పేరు వినిపిస్తోంది. రామ్ కామ్ జానర్ లో ఉంటుందని వినికిడి. పీరియాడిక్, యాక్షన్ డ్రామాలు చేసిన మణిరత్నం రిలీఫ్ కోసం సఖి తరహా ఎమోషనల్ డ్రామా చేయాలనే ప్లాన్ లో ఉన్నారట. ముందు కొత్త వాళ్ళతో అనుకున్నప్పటికీ మార్కెట్ లెక్కల దృష్ట్యా శింబునే లాక్ చేశారని అంటున్నారు. దగ్ లైఫ్ రిలీజయ్యాక దీనికి సంబంధించిన వివరాలు బయటికి రాబోతున్నాయి. ఇది కనక హిట్ అయితే మణిరత్నం ఫామ్ లోకి వచ్చినట్టే. నిజమో కాదో జూన్ 5 థియేటర్లలో తేలనుంది.