పవన్ కమిట్మెంట్ : పగలు షూట్ రాత్రి డబ్బింగ్

ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ తొలి ప్యాన్ ఇండియా మూవీ హరిహరవీరమల్లు పార్ట్ 1 విడుదలకు ఇంకో రెండు వారాలు మాత్రమే సమయముంది. అభిమానులు ఎప్పుడెప్పుడు తమ హీరో దర్శనమవుతుందాని ఎదురు చూస్తుండగా సాధారణ ప్రేక్షకుల్లో సైతం ఆసక్తి క్రమంగా పెరుగుతోంది. అయితే ఇప్పటిదాకా పవన్ డబ్బింగ్ చెప్పలేదనే కామెంట్స్ నేపథ్యంలో టీమ్ అఫీషియల్ గా దానికి సమాధానం చెప్పేసింది. ప్రస్తుతం ఓజి షూట్ లో బిజీగా ఉన్న పవన్ దాన్ని పగలు చేసుకుని రాత్రి పూట ఏకధాటిగా నాలుగు గంటల పాటు వీరమల్లుకి డబ్బింగ్ చెప్పేసి తన పని పూర్తి చేశాడు. ఇక సెన్సార్ ఫార్మాలిటీ ఒకటే బాకీ ఉంది.

దీంతో పవన్ కళ్యాణ్ కు సంబంధించిన బాధ్యత పూర్తయిపోయింది. గత రెండు మూడు నెలలుగా వీరమల్లు పూర్తి చేయడం కోసం డేట్లు ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడ్డ పవన్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలకు గుమ్మడికాయ కొట్టేందుకు డైరెక్టర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. టైం చాలా తక్కువగా ఉండటంతో నిర్మాత ఏఎం రత్నం, దర్శకుడు జ్యోతికృష్ణ కాళ్లకు చక్రాలు కట్టుకుని మెట్రో స్పీడ్ తో పనులు చేయడంలో బిజీగా ఉన్నారు. కంటెంట్ మీద నమ్మకంతో రత్నం ఓన్ రిలీజ్ కు వెళ్తున్నారనే వార్త ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో వంద కోట్లకు పైగా షేర్ ఆశిస్తున్నారు.

సో జనవరి తర్వాత ఒక పెద్ద హీరో సినిమా వస్తున్న నెల జూన్ ని హరిహర వీరమల్లు ఎంతమేరకు డామినేట్ చేస్తుందో చూడాలి. అదే రోజు పోటీ లేనప్పటికీ ఆపై వారం నుంచి వరసగా కుబేర, కన్నప్ప లాంటి ప్యాన్ ఇండియా మూవీస్ ఉన్నాయి. కాకపోతే పవన్ టాక్ కనక పాజిటివ్ తెచ్చుకుంటే కనీసం నెల రోజులు మంచి థియేటర్ రన్ దక్కుతుంది. థియేటర్ల బంద్ వివాదం, ఎగ్జిబిట్లర్ల పంచాయితీ, టాలీవుడ్ నిర్మాతల ప్రెస్ మీట్లు ఇవన్నీ కొలిక్కి వచ్చిన నేపథ్యంలో హరిహర వీరమల్లుకి ఇంకెలాంటి డైవెర్షన్లు ఉండబోవడం లేదు. మరి అంచనాలకు తగ్గట్టు వీరమల్లు ఏ స్థాయిలో మెప్పిస్తాడో చూడాలి.