నాగ్ డిజాస్టర్ ఇష్టమన్న ధనుష్

జూన్ 20 రాబోతున్న కుబేర మీద విభిన్నమైన అంచనాలున్నాయి. సాఫ్ట్ అండ్ ఎమోషనల్ సినిమాలతో పేరు తెచ్చుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల ఈసారి సీరియస్ డ్రామాని ఎంచుకున్నాడు. గతంలో లీడర్ చేశాడు కానీ అది పూర్తిగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్. అయితే ఈసారి క్రైమ్ ని ఎంచుకున్నాడు. సార్ తో తెలుగులోనూ మంచి మార్కెట్ ఏర్పరుచుకున్న ధనుష్ చేస్తున్న రెండో టాలీవుడ్ స్ట్రెయిట్ మూవీ ఇది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్రత్యేక ఆకర్షణ కానుంది. ఈ సందర్భంగా ధనుష్ ఇస్తున్న ఇంటర్వ్యూలలో కొన్ని ప్రత్యేక విశేషాలు బయట పడుతున్నాయి.

నాగార్జునతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం గురించి ధనుష్ మాట్లాడుతూ తనకు ఇష్టమైన ఆయన సినిమాల్లో రక్షకుడు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. అప్పట్లో కుంజుమోన్ నిర్మాణంలో భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ ప్యాన్ ఇండియా మూవీ మాములు డిజాస్టర్ కాదు. ఏఆర్ రెహమాన్ సంగీతం మినహాయించి కంటెంట్ పరంగా ఆడియన్స్ ని ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయిన రక్షక్షుడు ఆ టైంలో వచ్చిన సూపర్ ఫ్లాప్ గా మీడియాలో చాలా కథనాలొచ్చాయి. దర్శకుడు ప్రవీణ్ గాంధీకి తర్వాత ఒకటి రెండు అవకాశాలు దక్కినా త్వరగా కనుమరుగైపోయాడు. కుంజుమోన్ సైతం నష్టాలు తట్టుకోలేక చాలా కాలం ప్రొడక్షన్ ఆపేశారు.

రక్షకుడు వెనుక ఇంత పెద్ద స్టోరీ ఉంది. అయినా సరే ఈ సినిమాలో ఫ్యాన్ మూమెంట్స్ కొన్ని బాగుంటాయి. ముఖ్యంగా విలన్ గ్యాంగ్ ని నాగార్జున వెంటపడి తరిమే ఎపిసోడ్, క్లైమాక్స్ లాంటివి అబ్బురపరుస్తాయి. కాకపోతే కథ కథనాలు సరిగా లేకపోవడంతో జనాలు రిసీవ్ చేసుకోలేదు. శివ, గీతాంజలి, హలో బ్రదర్ డబ్బింగ్ వెర్షన్లతో తమిళంలో మార్కెట్ సంపాదించుకున్న నాగార్జున రక్షకుడు తర్వాత మళ్ళీ ఇంకో కోలీవుడ్ సినిమా చేయలేదు. ధనుష్ ఏ ఉద్దేశంతో అన్నా అక్కినేని ఫ్యాన్స్ మాత్రం ఈ ముచ్చటని ప్రత్యేకంగా షేర్ చేసుకుంటున్నారు. అప్పట్లో దీని ఇంపాక్ట్ సాహో రేంజ్ లో ఉండేది మరి.