కులం గురించి మనోజ్ ఓపెన్ టాక్

‘భైరవం’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో అందరి దృష్టీ మంచు మనోజ్ మీదే నిలిచింది. ఒకప్పుడు టాలీవుడ్ బిజీ హీరోల్లో ఒకడిగా ఉన్న మనోజ్.. ఎనిమిదేళ్ల పాటు తెర మీద కనిపించకపోవడం అంటే షాకింగే. ఎప్పుడో 2017లో ‘ఒక్కడు మిగిలాడు’ చిత్రంతో అతను ప్రేక్షకులను పలకరించాడు. అనివార్య కారణాల వల్ల తన కెరీర్లో చాలా గ్యాప్ వచ్చేసింది. ఇన్నేళ్లకు పునరాగమనం చేస్తుండడం.. మరోవైపు తన కుటుంబ వివాదం వల్ల ఈ సినిమా ఈవెంట్లో మనోజ్ ఏం మాట్లాడతాడా అని అంతా ఆసక్తిగా చూశారు.

ఐతే గత ఈవెంట్లో మాదిరి ఫ్యామిలీ ఇష్యూస్‌కు సంబంధించి ఇన్ డైరెక్ట్ కామెంట్లేవే చేయకుండా.. పూర్తిగా సినిమాకు సంబంధించిన విషయాల మీదే మాట్లాడాడు మనోజ్. మామూలుగా చాలామంది ఓపెన్ కాని అంశాలను అతను ప్రత్యేకంగా ప్రస్తావించాడు. అందులో ఒకటి దర్శకుడు విజయ్ కనకమేడల పాత ఫేస్ బుక్ పోస్టు మీద చెలరేగిన వివాదం. విజయ్ కూడా మెగా ఫ్యానే అని నొక్కి వక్కాణిస్తూ.. జరిగిన దానికి టీం తరఫున సారీ చెప్పి ఆ వివాదానికి తెరదించే ప్రయత్నం చేశాడు మనోజ్.

ఇక మనోజ్ ప్రస్తావించిన మరో కీలక విషయం.. కులానికి సంబంధించింది. ఈ సినిమా హీరోలందరిదీ ఒకే కులం అని, దర్శకుడూ అదే కులానికి చెందిన వాడని.. ఒక కులం వాళ్లు కలిసి చేస్తున్న సినిమా అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ గురించి మనోజ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కులం అనేది ఈ తరంతో అంతరించిపోవాలని, తన పిల్లల వరకు అది వెళ్లకూడదని తాను భావిస్తున్నానని.. అసలు కులం అన్నది చూడకుండా అందరికీ ప్రేమను, డబ్బును ఇచ్చేది సినిమా ఇండస్ట్రీ అని మనోజ్ అన్నాడు.

ఇది కమ్మ సినిమానా, కాపు సినిమానా, రెడ్డి సినిమానా అని చూసి ప్రేక్షకులు థియేటర్లకు రారని.. అలాగే ఇండస్ట్రీలో ఎవరూ కులం చూసి అవకాశాలు ఇవ్వరని మనోజ్ తెలిపాడు. అలాంటి సినిమాకు కులం రంగు పూసి టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని మనోజ్ అభిప్రాయపడ్డాడు. ఎవరినైనా ఈ రోజుల్లో పది వేలు డబ్బులు కావాలని అడిగి చూస్తే రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలని.. కానీ ఇండస్ట్రీలో ఏదీ చూడకుండా కేవలం టాలెంట్‌ ఆధారంగా నిర్మాతలు అందరికీ డబ్బులు ఇస్తారని.. ఇలాంటి ఇండస్ట్రీ మరేదీ ఉండదని మనోజ్ స్పష్టం చేశాడు.