థియేటర్ల కప్పులో వీరమల్లు తుఫాను

ఏపీ, తెలంగాణలో సింగల్ స్క్రీన్ల బంద్ ఖచ్చితంగా ఉంటుందో లేదో నిర్ధారణ కాకముందే హరిహర వీరమల్లు విడుదలకు ముందు కావాలనే ఇలాంటి చర్యలకు కొందరు శ్రీకారం చుట్టారనే టాక్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ఇండస్ట్రీలో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ దీని వెనుక ఎవరున్నారో కనిపెట్టాలని విచారణకు ఆదేశించడం కొత్త మలుపుకు దారి తీసింది. నిజానికి బంద్ ఉండకపోవచ్చని, ఇంకొంచెం అదనపు సమయం తీసుకుని రెంటల్, పర్సెంటెజ్ గురించి మెల్లగా పరిష్కారాలు కనుగొందామని, అప్పటిదాకా కొంచెం ఓపిక పట్టమని నిర్మాతల సమాఖ్య ఎగ్జిబిటర్లకు సూచించవచ్చట.

ప్రభుత్వం ఏదున్నా పవన్ సినిమాలు వస్తున్నప్పుడే ఏదో ఒక ఇబ్బందులు తలెత్తడం ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. వకీల్ సాబ్ టైంలో ఏకంగా రెవిన్యూ డిపార్ట్ మెంట్ ని మోహరింపజేసి తక్కువ రేట్లకు టికెట్లు అమ్మించడంతో మొదలుపెట్టి భీమ్ల నాయక్, బ్రో కు సైతం ఇదే ధోరణి కొనసాగడం వాళ్లకు గుర్తే. ఇప్పుడు గవర్నమెంట్ మారి పవన్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సైతం థియేటర్ బంద్ లాంటి పిలుపులు జరగడం అనూహ్యం. ట్రేడ్ వర్గాలు బంద్ గురించి అసోసియేషన్ తరఫున ఏదైనా ప్రెస్ నోట్ లేదా ;లేఖ లాంటిది వస్తే తప్ప అది జరుగుతున్నట్టు కాదని, అప్పటిదాకా ఇవన్నీ ఊహాగానాలేనని అంటున్నారు.

ఒకవేళ థియేటర్లు నిజంగా బంద్ అయితే హరిహర వీరమల్లు కన్నా ముందు భైరవం, దగ్ లైఫ్ ప్రభావితం చెందుతాయి. వీటి మీద ఎంత లేదన్నా ముప్పై కోట్లకు పైగా థియేటర్ బిజినెస్ ఆధారపడి ఉంది. కేవలం మల్టీప్లెక్సుల్లో షోలు వేయడం ద్వారా రికవరీ అయిపోదు. వీరమల్లుకైనా ఒక పన్నెండు రోజులు టైం దొరుకుంటుందేమో కానీ వీటికా ఛాన్స్ లేదు. విశ్వసనీయ సమాచారం మేరకు బంద్ అయితే జరగకపోవచ్చు. హరిహర వీరమల్లుతో పాటు జూన్ లో రాబోతున్న కుబేర, కన్నప్పలకు సైతం ఎలాంటి అడ్డంకి ఏర్పడకపోవచ్చు. సో బందు కప్పులో వీరమల్లు తుఫాను త్వరగానే సమిసిపోవచ్చని ఇండస్ట్రీ టాక్. చూద్దాం.