-->

వసూళ్ల ‘వర్షం’లో కొత్త రిలీజుల మౌనం

ఇవాళ శుక్రవారం కొత్త రిలీజులున్నా బాక్సాఫీస్ వద్ద సందడి కనిపించడం లేదు. మే నెలలో శ్రీవిష్ణు సింగిల్ తర్వాత ఇంకే సినిమా చెప్పుకోదగ్గ సౌండ్ చేయలేకపోయింది. జగదేకవీరుడు అతిలోకసుందరి కొంత మేర వర్కౌట్ చేసుకోగా అద్భుతం చేస్తుందనుకున్న యమదొంగ పెద్దగా వసూళ్లు తేలేదు. ఈ నేపథ్యంలో ఇదే నిర్లిప్తత ఇవాళ కూడా కొనసాగేలా ఉంది. విజయ్ సేతుపతి – రుక్మిణి వసంత్ ‘ఏస్’ మీద పెద్దగా అంచనాలు లేకపోవడంతో ప్రమోషన్లు కూడా అంతంత మాత్రంగా చేయడంతో టాలీవుడ్ ప్రేక్షకులకు రిజిస్టర్ కాలేదు. మహారాజాలాగా ఎక్స్ ట్రాడినరి టాక్ వస్తేనే ఆడియన్స్ ని థియేటర్లకు రాబట్టగలదు.

హిందీ బ్లాక్ బస్టర్ ‘కేసరి చాప్టర్ 2’ ఒరిజినల్ వెర్షన్ ఎంత హిట్టయినా తెలుగు అనువాదం చాలా ఆలస్యం చేయడంతో మన ఆడియన్స్ ఏమంత ఆసక్తి కనబరచడం లేదు. అందులోనూ పబ్లిసిటీ మీద పెద్దగా దృష్టి పెట్టకపోవడం కలెక్షన్లను ప్రభావితం చేయనుంది. చావా తరహాలో దీని మీద టాలీవుడ్ జనాలకు ఇంటరెస్ట్ లేదనే విషయం తేటతెల్లమవుతోంది. ఇవి కాకుండా వీరరాజు, నిశ్శబ్ద ప్రేమ, వైభవం అంటూ మరికొన్ని చిన్న సినిమాలు రేస్ లో ఉన్నాయి కానీ వీటికి మార్నింగ్ షోల్లో జనాలు కనిపించినా గొప్పే. ఐపీఎల్ ప్రభావం లేకపోయినా థియేటర్ల దగ్గర నిశ్శబ్ద వాతావరణం తాండవిస్తోంది.

ట్విస్ట్ ఏంటంటే ‘వర్షం’ రీ రిలీజ్ ట్రెండింగ్ లో ఉంది. బుక్ మై షోలో గత ఇరవై నాలుగు గంటల్లో 15 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోవడం చూస్తే ప్రభాస్ డామినేషన్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వర్షం రీ రిలీజ్ కావడం ఇది మొదటిసారి కాదు. అయినా సరే ఇంత స్పందన రావడం అనూహ్యం. కరెంట్ బుకింగ్స్ కలుపుకుంటే భారీ నెంబర్లు నమోదు కావడం ఖాయంగా కనిపిస్తోంది. బాలీవుడ్ రిలీజులు భూల్ ఛుక్ మాఫ్, కేసరి వీర్ లకు రెస్పాన్స్ అంతంత మాత్రంగా ఉంది. మే 30 బెల్లంకొండ సాయిశ్రీనివాస్ భైరవం దాకా ఈ పరిస్థితిలో పెద్దగా మార్పు వచ్చే సూచనలు కనిపించడం లేదు.