కోలీవుడ్ మక్కల్ సెల్వన్ గా అభిమానులు పిలుచుకునే విజయ్ సేతుపతి త్వరలో దర్శకుడు పూరి జగన్నాథ్ తో చేతులు కలుపుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీని కోసం క్రేజీ క్యాస్టింగ్ ని పూరి సెట్ చేస్తున్నారు. టబు, రాధికా ఆప్టే, నివేదా థామస్ ఆల్రెడీ కన్ఫర్మ్ కాగా కొద్దిరోజుల క్రితం వీరసింహారెడ్డి విలన్ దునియా విజయ్ ని ప్రతినాయకుడిగా లాక్ చేశారు. ఇంకొందరు ఊహించని తారాగణం ఇందులో ఉంటారని అంటున్నారు. సత్యదేవ్, ఫహద్ ఫాసిల్ లో ఎవరో ఒకరు తొడవ్వొచ్చనే ప్రచారం ఉంది కానీ ఇది పుకారేనని టీమ్ టాక్.
ఇదిలా ఉండగా దీనికి బెగ్గర్ టైటిల్ ఫిక్స్ చేశారని ప్రాజెక్టు అనౌన్స్ మెంట్ వచ్చిన దగ్గరి నుంచి చాలా ప్రచారం జరిగింది. కానీ విజయ్ సేతుపతి అదేమీ లేదంటున్నారు. ఇంకా పేరు ఫిక్స్ చేయలేదని, మీరే అనుకుంటున్నారని నిన్న జరిగిన ఏస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చమత్కరించారు. గత ఏడాది తమిళంలో బ్లడీ బెగ్గర్ అనే సినిమా ఒకటొచ్చింది. ఫ్లాపయ్యింది కానీ జనంలో రిజిస్టరయ్యింది. దానికి దగ్గరగా ఉండే పేరుని మళ్ళీ పెట్టాలా వద్దా అనే మీమాంసలో పూరి బృందం ఉన్నట్టు చెన్నై రిపోర్ట్. కాబట్టి బెగ్గర్ అని ప్రాధమికంగా అనుకుని ఉండొచ్చు కానీ ప్రస్తుతానికి కన్ఫర్మ్ కాలేదనే క్లారిటీ వచ్చేసింది.
వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళబోతున్న ఈ ప్యాన్ ఇండియా మూవీ కథని కేవలం కొన్ని గంటల్లో చెప్పి ఒప్పించారని విజయ్ సేతుపతి చెప్పడం విశేషం. ఆడియన్స్ కన్నా ఎక్కువగా నేనే ఎదురు చూస్తున్నానని, అంత బాగా కథ వచ్చిందని అన్నారు. నిజానికి మక్కల్ సెల్వన్ ఏదిబడితే అది గుడ్డిగా ఒప్పుకునే రకం కాదని కోలీవుడ్ వర్గాల్లో అంటుంటారు. సో పూరి చెప్పిన స్టోరీ ఆషామాషీగా ఉండి ఉండదు. పైగా లైగర్, డబుల్ ఇస్మార్ట్ రెండు డిజాస్టర్ల తర్వాత చేస్తున్న సినిమా కావడంతో బాగా కసి మీదున్నారు. దీంతో హిట్టు కొట్టి పూరి జగన్నాథ్ మళ్ళీ కంబ్యాక్ అవ్వాలని మూవీ లవర్స్ కోరుకుంటున్నారు.