అనిల్ తర్వాత బాబికే ‘మెగా’ ఆఫర్

విశ్వంభర తర్వాత చిరంజీవి కమిట్ మెంట్ ఇచ్చింది అనిల్ రావిపూడి, శ్రీకాంత్ ఓదెలకే. వీళ్ళు ఇద్దరూ కాకుండా అఫీషియల్ గా ఎవరికీ ఎస్ చెప్పలేదనేది నిన్నటి దాకా వినిపించిన టాక్. ఫైనల్ గా దానికో క్లారిటీ వచ్చేసింది. కొద్దివారాల క్రితం లీకైనట్టు వాల్తేరు వీరయ్య కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ మెగాస్టార్ మరోసారి దర్శకుడు బాబీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇటీవలే ఒక ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన రచయిత కోన వెంకట్ ఈ విషయాన్ని పంచుకోవడంతో పాటు స్క్రీన్ ప్లే సమకూరుస్తున్నానని చెప్పడంతో సందేహాలు తీరిపోయాయి. అనిల్ రావిపూడి తర్వాత ఈ సినిమానే ఉంటుందని చూచాయగా చెప్పేశారు.

దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం మరొకటి ఉంది. అనిల్ రావిపూడి సినిమా అయ్యాక చిరంజీవికి గ్యాప్ వస్తుంది. శ్రీకాంత్ ఓదెల నాని ప్యారడైజ్ పూర్తి చేసుకుని, రిలీజ్ చూసుకుని వచ్చేలోపు 2026 మార్చ్ వచ్చేస్తుంది. ఆ తర్వాతే మెగా స్క్రిప్ట్ మీద పని మొదలుపెట్టాలి. అటుపై ఇంకో ఆరు నెలలు పట్టే అవకాశాన్ని కొట్టి పారేయలేం. ఈలోగా చిరు బాబీది సులభంగా ఫినిష్ చేయొచ్చు. బాషా ఫార్ములాలో రెగ్యులర్ గా కాకుండా కొత్త పాయింట్ ట్రై చేస్తున్నామని, అలాని ఫ్యాన్స్ నిరాశపరచకుండా, ప్రేక్షకులు చిరంజీవి నుంచి ఏమేం కోరుకుంటారో అవన్నీ ఉంటాయని కోన వెంకట్ కుండ బద్దలు కొట్టేశారు.

సో వాల్తేరు వీరయ్యని మించి హిట్ ఇవ్వాల్సిన బాధ్యత బాబీ మీద ఉంది. బాలకృష్ణ డాకు మహారాజ్ హిట్టయినప్పటికీ దాన్ని పూర్తి స్థాయిలో సంతృప్తి పరిచేలా హ్యాండిల్ చేయలేదనే కామెంట్స్ బాబీ మీద వచ్చాయి. ముఖ్యంగా సెకండాఫ్, క్లైమాక్స్ గురించి ఎక్కువ విశ్లేషణలు జరిగాయి. అందుకే సంక్రాంతికి వస్తున్నాం పోటీని తట్టుకోలేక డాకు మహారాజ్ డీసెంట్ హిట్ గా రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈసారి బాబీ అలాంటి పొరపాట్లకు తావివ్వకుండా చూసుకోవాలి. టాక్సిక్, జన నాయగన్ నిర్మిస్తున్న కెవిఎన్ ప్రొడక్షన్స్ లో ఈ సినిమా రూపొందవచ్చని తెలిసింది.