తమిళంలో యాక్షన్ సినిమాలకు పేరుపడ్డ విశాల్.. గతంలో చాలా ఫిట్గా కనిపించేవాడు. తమిళంలో ముందుగా సిక్స్ ప్యాక్ చేసిన హీరోల్లో అతనొకడు. తన సినిమాల శైలికి తగ్గట్లే అతనపుడు చాలా దృఢంగా కనిపించేవాడు. ఐతే ఎలాంటి హీరోకైనా వయసు పెరిగేకొద్దీ ఫిట్నెస్ తగ్గడం మామూలే. విశాల్ కూడా అందుకు మినహాయింపు కాలేకపోయాడు. గత కొన్నేళ్లలో వచ్చిన సినిమాల్లో తన లుక్ దెబ్బ తింది. ఐతే అంత వరకు ఓకే కానీ.. ఇటీవల విశాల్ తీవ్ర అనారోగ్యం దెబ్బ తిన్నట్లు వార్తలు రావడంతో అభిమానులు కంగారు పడ్డారు.
తన లాంగ్ డిలేయ్డ్ మూవీ ‘మదగజ రాజా’ సంక్రాంతి టైంలో రిలీజైనపుడు విశాల్ చాలా ఇబ్బందికరంగా కనిపించడం, మైక్ పట్టుకుని మాట్లాడుతుంటే తన చేతులు వణకడం, ముఖంలో మార్పు రావడం చర్చనీయాంశం అయింది. కొన్ని రోజులకు అతను కోలుకున్నట్లే కనిపించాడు. అంతటితో కథ సుఖాంతం అయిందనుకుంటే.. తాజాగా విశాల్ ఒక కార్యక్రమం సందర్భంగా స్టేజ్ మీద కళ్లు తిరిగి పడిపోవడం, అతణ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాల్సిన పరిస్థితి రావడంతో మళ్లీ అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. విశాల్కు ఏదైనా తీవ్ర అనారోగ్య సమస్య ఉందా అన్న చర్చ జరుగుతోంది. ఐతే లేటెస్ట్ ఇన్సిడెంట్ గురించి విశాల్ మేనేజర్ మీడియాకు క్లారిటీ ఇచ్చాడు.
విశాల్ ఆహారం తీసుకోకపోవడం వల్ల కళ్లు తిరిగి పడిపోయాడని.. అంతకుమించి ఏమీ లేదని.. చికిత్స అనంతరం కోలుకున్నాడని చెప్పాడు. కానీ ఇదే అసలైన కారణమా అని మీడియా వాళ్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘మదగజ రాజా’ టైంలో హై ఫీవర్ వల్లే విశాల్ చేతులు వణికాయన్నారు. కానీ ఆ మాత్రానికే అలా అవుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఫుడ్ తీసుకోకపోవడం వల్లే విశాల్ అలా పడిపోయాడన్నా కూడా నమ్మకం కలగట్లేదు. విశాల్ సమస్య ఏదైనప్పటికీ అతను దాన్నుంచి పూర్తిగా కోలుకుని మళ్లీ ఫిట్గా తయారవ్వాలని, ఒకప్పట్లాగే హుషారుగా సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.