ఆర్ఆర్ఆర్ లండన్ : ముగ్గురు స్టార్ల కలయిక

కాంబోలు సెట్ చేయడంలో, అరుదైన కలయికలు చేసి చూపించడంలో రాజమౌళి తర్వాతే ఎవరైనా. ఇవాళ లండన్ లో ఆర్ఆర్ఆర్ లైవ్ కన్సర్ట్ జరగబోతోంది. రాయల్ ఆల్బర్ట్ హాల్ లో భారీ ప్రేక్షకుల మధ్య జరిగే ఈ గ్రాండ్ ఈవెంట్ కి రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, జక్కన్నతో పాటు పలువురు కీలక సభ్యులు హాజరు కాబోతున్నారు. అసలు విశేషం ఇది కాదు. వీళ్ళతో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు జట్టు కట్టనున్నాడు. ఈ మేరకు అక్కడికి చేరుకున్నట్టు లేటెస్ట్ అప్డేట్. ఒకే పార్టీలో ఈ ముగ్గుర్ని చూశాం కానీ బయట పబ్లిక్ స్టేజిని పంచుకోవడం మాత్రం ఇదే మొదటిసారని చెప్పాలి. అందుకే స్పెషల్ కానుంది.

ఎస్ఎస్ఎంబి 29లో నటించడం వల్లే మహేష్ హాజరుకు కారణం కావొచ్చు కానీ నిజానికి అవసరం లేదనుకుంటే డ్రాప్ అవ్వొచ్చు. కానీ ఆర్ఆర్ఆర్ ని ఇష్టపడిన సాటి హీరోగా తన ప్రెజెన్స్ మరింత గ్లామర్ ని తీసుకొస్తుందని భావించి ఎస్ చెప్పారు. ఈవెంట్ కి సంబందించిన లైవ్ కవరేజ్ మనకు చూసే అవకాశం లేదు కానీ ఫోటోలు, వీడియోలు వచ్చేస్తాయి కాబట్టి అక్కడ చూసుకోవచ్చు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి ఆధ్వర్యంలో జరగబోయే ఈ మ్యూజికల్ గ్రాండియర్ గతంలో జరిగిన బాహుబలి తరహాలోనే లైవ్ ఆర్కెస్ట్రాతో ఉంటుంది. నాటు నాటు పాటను ప్రత్యక్షంగా ఎలా రికార్డింగ్ చేశారో చూడొచ్చు.

ఇలాంటి జ్ఞాపకాలు ఫ్యాన్స్ కు ప్రత్యేకంగా గుర్తుండిపోతాయి. మేడం టుస్సాడ్ మ్యుజియంలో తన మైనపు బొమ్మ ఆవిష్కరణ కోసం ఇప్పటికే లండన్ లో ఉన్న రామ్ చరణ్ నిన్న దాన్ని పూర్తి చేసుకున్నాడు. ఇవాళ ఆర్ఆర్ఆర్ ఈవెంట్ లో భాగం పంచుకోబోతున్నాడు. రిలీజై మూడేళ్లు గడిచిపోయినా ట్రిపులార్ తాలూకు సెలబ్రేషన్స్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. మహేష్ బాబు 29 షూట్ కి చిన్న బ్రేక్ ఇచ్చిన రాజమౌళి ఈ రకంగా మహేష్ బాబు సమయాన్ని వాడుకోవడం గమనార్హం. తారక్, చరణ్, మహేష్ ఈ ముగ్గురు అక్కడ కలుసుకోవడం సరే కానీ ఒకవేళ ఇదే కాంబోతో మల్టీస్టారర్ చేయాలంటే అది కూడా రాజమౌళికే సాధ్యం.