యుద్ధం ఆగింది – పరిశ్రమకు ఊపొచ్చింది

నిన్న అమెరికా చొరవ వల్ల కాల్పుల విరమణకు రెండు దేశాలు అంగీకరించడం పట్ల పలు రకాల స్పందనలు వస్తున్నప్పటికీ ఇలాంటి పరిస్థితుల్లో ఇదొక్కటే పరిష్కారమని విశ్లేషకులు భావిస్తున్నారు. తమతో పోరాటం ఎంత ప్రమాదమో భారతదేశం చాలా స్పష్టంగా పాకిస్థాన్ కు దాడుల రూపంలో తెలియజేసిందని, ఇకపై ఎలాంటి రెచ్చగొట్టే పనులు పాక్ చేయలేదని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా యుద్ధ మేఘాలు తీవ్ర స్థాయిలో కమ్ముకుంటే థియేటర్ ప్రదర్శనలు ఆగిపోయి పరిశ్రమ మనుగడే ప్రమాదంలో పడుతుందని భావించిన నిర్మాతలు ఇప్పుడు హమ్మయ్య అనుకుంటున్నారు. టెన్షన్ తగ్గినందుకు సంతోషపడుతున్నారు.

నిజంగానే ఒక వేళ యుద్ధం తీవ్రమయ్యుంటే దాని ప్రభావం నేరుగా బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా అందరి మీదా పడేది. ప్యాన్ ఇండియా రిలీజులు ఆపాల్సి వచ్చేది. జనాలు వస్తారో రారోననే భయంతో పెద్ద నిర్మాతలు సినిమాలు విడుదలలు పోస్ట్ పోన్ చేసేవాళ్ళు. కింగ్ డమ్, హరిహర వీరమల్లు, కన్నప్ప లాంటివి రిస్క్ లో పడేవి. కానీ ఇప్పుడా భయం లేదు. ఐపీఎల్ వారం పాటు వాయిదా పడటంతో మెల్లగా ఈ ప్రభావం మనకు సానుకూలంగా మారుతోంది. జనాలు క్రికెట్ లేదు కాబట్టి ఎంటర్ టైన్మెంట్ కోసం థియేటర్లకు వస్తున్నారు. సింగిల్ ఫుల్  స్వింగ్ లో ఉండగా, హిట్ 3 ది థర్డ్ కేస్, రైడ్ లు మళ్ళీ ఊపందుకుని ట్రెండింగ్ లోకి వచ్చేశాయి.

ఏదైతేనేం కరోనా నాటి పీడకలలు మళ్ళీ పరిశ్రమకు రాకుండా యుద్ధం ఆగిపోయింది. పాకిస్థాన్ మనల్ని ఏదో చేసేంత సీన్ లేకపోయినా ఒక్కసారి వార్ మొదలైతే దాని ఎఫెక్ట్ ఏదో ఒక రూపంలో పడుతుంది. అంతెందుకు ఉత్తరాది రాష్ట్రాల్లో పలు చోట్ల సూపర్ మార్కెట్లలో స్టాక్ మొత్తం మొన్నే అయిపోయిందట. కారణం ఏంటయ్యా అంటే జనాలు ముందు జాగ్రత్తలు సరుకులన్నీ ఎక్కువ కాలం నిల్వ ఉంచుకునేలా కొనేసుకుని వెళ్లారట. పుకారుగా వచ్చిన అనుమానమే ఇలాంటి పరిణామాలకు దారి తీస్తే ఇక యుద్ధం వస్తే ఎలా ఉంటుందో వేరే చెప్పాలా. పెహల్గామ్ దుర్ఘటనకు గట్టి గుణపాఠమే చెప్పిన ఇండియా ఇకపై మరింత కఠినం కానుంది.