=

రియల్ ట్విస్టులు….కాంతారను వెంటాడుతున్న కష్టాలు

తెరమీద చూసే సినిమాల్లోనే కాదు కొన్నిసార్లు వాటి షూటింగుల్లో కూడా ఊహించని ట్విస్టులు ఎదురవుతూ ఉంటాయి. కెజిఎఫ్ తర్వాత మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీగా శాండల్ వుడ్ తో పాటు తెలుగు తమిళ పరిశ్రమలు ఎదురు చూస్తున్న కాంతార చాప్టర్ 1కు కష్టాల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా జరిగిన దుర్ఘటనలో కపిల్ అనే జూనియర్ ఆర్టిస్టు నీటమునిగి చనిపోవడం యూనిట్ లో విషాదం రేపింది. ప్రస్తుతం కేరళ సౌపర్ణిక నది వద్ద చిత్రీకరణ చేస్తున్న హీరో కం దర్శకుడు రిషబ్ శెట్టికి ఈ పరిణామాలు కంటికి కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇది ఇప్పుడు మొదలయ్యింది కాదు. నెలలుగా జరుగుతున్నదే.

బెంగళూరు సమీపంలోని అటవీ ప్రాంతంలో షూట్ చేస్తున్నప్పుడు ఏకంగా కర్ణాటక అటవీ శాఖా మంత్రి అభ్యంతరం వ్యక్తం చేసి పర్యావరాణాన్ని హాని చేస్తున్నారంటూ కేసు నమోదు చేయించడం గత ఏడాది సంచలనం రేపింది. దాని గురించి ఇంకా కోర్టులో వాదోపవాదాలు జరుగుతున్నాయి. దీని తర్వాత ఒకసారి టీమ్ ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురై కొందరు జూనియర్ ఆర్టిస్టులు గాయపడటంతో బ్రేక్ వేయాల్సి వచ్చింది. విపరీతమైన గాలి తుఫాను వల్ల సెట్స్ కూలిపోయి తీవ్ర నష్టం కలగడం మరో సంఘటన. ఇలా ఒకటి రెండు కాదు ఎన్నో అవాంతరాలు కాంతారకు వస్తూనే ఉన్నాయి.

అక్టోబర్ 1 విడుదల చేయాలని అధికారిక ప్రకటన ఇచ్చిన రిషబ్ శెట్టి ఇప్పుడా లక్ష్యాన్ని చేరుకోవడం కష్టంగానే ఉంది. ఇది దైవం పెడుతున్న పరీక్షగా భావించి కఠినమైన సవాళ్లు ఎదురుకుంటున్నాడు. హోంబాలే ఫిలిమ్స్ దీని మీద భారీ బడ్జెట్ పెడుతోంది. ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటిదాకా చూడనంత గొప్పగా ఈ డివోషనల్ థ్రిల్లర్ ఉంటుందని అందులో పని చేస్తున్న వాళ్ళు చెబుతున్న మాట. ఈ స్పీడ్ బ్రేకులను తట్టుకుని కాంతార చాప్టర్ 1 అనుకున్న సమయానికి వస్తుందా లేదానేది ప్రస్తుతానికి సస్పెన్సే. కాంతారకు ముందు ఏం జరిగిందనే పాయింట్ మీద రిషబ్ శెట్టి దీన్ని రూపొందిస్తుండటం విశేషం.