నిన్న జరిగిన లార్వెన్ ఏఐ స్టూడియో ప్రారంభోత్సవంలో దర్శకులను ఉద్దేశించి నిర్మాత దిల్ రాజు అన్న మాటలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. ఇప్పటి డైరెక్టర్లు రెండు మూడు సంవత్సరాలు ఒక్క సినిమానే తీయగలుగుతున్నారని, దీని వల్ల జాప్యం పెరిగి ఆ భారం ప్రొడ్యూసర్ల మీద పడటంతో పాటు ఎక్కువ చిత్రాలు రాకుండా ఇండస్ట్రీ మీద ప్రభావం చూపిస్తోందని అన్నారు. ఒక్క అనిల్ రావిపూడి మాత్రమే ఏడాదికి ఒక సినిమా తీస్తున్నాడని చెప్పుకొచ్చారు. సంక్రాంతికి వస్తున్నాం ఆరేడు నెలల్లో పూర్తయి బ్లాక్ బస్టర్ కొడితే అదే బ్యానర్ లో గేమ్ ఛేంజర్ మూడేళ్ళకు పైగా నిర్మాణం జరుపుకుని దారుణమైన డిజాస్టర్ అందుకుంది.
ఇక్కడ సీరియస్ గా ఆలోచించాల్సిన పాయింట్లు కొన్నున్నాయి. ఒకప్పుడు దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి లాంటి అగ్ర దర్శకులు ఒకేసారి నాలుగైదు సినిమాలు సెట్ల మీద ఉన్నా దేంట్లోనూ రాజీ పడకుండా శాయశక్తులా బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నించేవారు. స్టార్లతో చేయాలని కంకణం కట్టుకునే వారు కాదు. బాలకృష్ణ, వెంకటేష్ లాంటి అగ్ర హీరోలతో బ్లాక్ బస్టర్లు తీస్తున్న టైంలోనే కోడి రామకృష్ణ పెళ్ళాం చెబితే వినాలి, భారత్ బంద్, మధురానగరిలో లాంటి స్టార్ క్యాస్టింగ్ అవసరం లేని సినిమాలు ఇచ్చారు. ఇవన్నీ ఒకదాన్ని మించి మరొకటి ఆడినవి. ఈవీవీ సత్యనారాయణ మరో ఉదాహరణ.
కానీ ఇప్పుడు ట్రెండ్ మారిందని, లేదా అభిమానుల అంచనాలు పెరిగాయని చిన్నా పెద్దా దర్శకులు అందరూ నిదానమే ప్రధానం సూత్రం పాటించడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. అసలే చిన్న సినిమాలకు గడ్డుకాలం దాపురించింది. నానారకాల ప్రయాసలు పడి థియేటర్ల దాకా తీసుకొచ్చినా కనీసం మొదటి రోజు మార్నింగ్ షోకు జనాన్ని తేలేని దీనస్థితిని ఎందరో నిర్మాతలు చవిచూస్తున్నారు. అందుకే క్రమం తప్పకుండా పేరున్న బ్యానర్లు, దర్శకులు, హీరోలు వేగంగా సినిమాలు చేయాలి. అలాని కంటెంట్ క్వాలిటీ చూడొద్దని కాదు. పక్కనే మోహన్ లాల్, మమ్ముట్టిలు యమా స్పీడ్ గా చేసి హిట్లు కొట్టడం చూస్తున్నాంగా.
Gulte Telugu Telugu Political and Movie News Updates