పిక్ టాక్!.. అన్నగారి లుక్కులో బాలయ్య!

తెలుగు చలనచిత్ర నటసింహం, టీడీపీ శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ కెరీర్ లో ఈ సోమవారానికి ఓ ప్రత్యేకత ఉంది. భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మ భూషణ్ అవార్డును బాలయ్య సోమవారం సాయంత్రం అందుకున్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని బాలయ్య తన ఫ్యామిలీ పరివారంతో కలిసి సోమవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తన పరివారంతో కలిసి అక్కడ ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ ఫొటోల్లో బాలయ్యను చూస్తే… ఆయన తండ్రి, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం నందమూరి తారకరామారావునే చూసినట్లుగా ఉంది. అనంతరం తన తండ్రి తరహా హావభావాలతో సాగి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి అవార్డును స్వీకరించారు.

పద్మ భూషణ్ పురస్కారాన్ని బాలయ్య అందుకునే… ఈ అరుదైన సన్నివేశాన్ని ప్రత్యక్ష్యంగా వీక్షించేందుకు బాలయ్య సోదరి, టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి, బాలయ్య సతీమణి వసుంధర, కుమారుడు మోక్షజ్ఞ తేజలతో పాటు పెద్ద కుమార్తె బ్రాహ్మణి, ఆమె భర్త, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్, వారి కుమారుడు, బాలయ్య మనవడు నారా దేవాన్ష్, చిన్న కుమార్తె  తేజస్వినీ, ఆమె భర్త, విశాఖ ఎంపీ శ్రీభరత్ తదితరులు బాలయ్య వెంట రాష్ట్రపతి భవన్ చేరుకున్నారు.

ఈ సందర్భంగా తీసుకున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ తర్వాత పద్మ భూషణ్ అవార్డును అందుకున్న దృశ్యాల వీడియో కూడా సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. ఈ ఫొటో, వీడియోలను చూసిన వారంతా… బాలయ్యను చూసినంతనే… రాష్ట్రపతి భవన్ కు సీనియర్ ఎన్టీఆర్ వచ్చారా? అంటూ ఆసక్తి వ్యక్తం చేశారు. అచ్చ తెలుగు పంచె కట్లులో బాలయ్య ఈ వేడుకకు హాజరు అయ్యారు. దీంతో పంచెకట్లులో ఆయనను చూసినంతనే జనానికి ఎన్టీఆరే గుర్తుకు వచ్చారు. ఒక్క హైట్ తప్పిస్తే.. బాలయ్య అచ్చు గుద్దినట్టుగా తన తండ్రి ఎన్టీఆర్ మాదిరే కనిపించి అందరికీ కనువిందు చేశారనే చెప్పాలి. నటనలో విశేష ప్రతిభ కనబరచినందుకు బాలయ్యను పద్మ భూషణ్ అవార్డుకు ఇటీవలే కేంద్రం ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.