ఇప్పుడు ఇండస్ట్రీలో జరుగుతున్న చర్చ ఒకటే. జనాలు థియేటర్లకు ఎందుకు రావడం లేదు. రివ్యూల ప్రభావమా లేక ఎండలు, ఐపీఎల్ లాంటి ఇతర కారణాలు దోహదం చేస్తున్నాయా అనే దాని మీద చిన్నా పెద్ద నిర్మాతలు గత కొన్ని రోజులుగా డిస్కషన్లు పెట్టుకుంటూనే ఉన్నారు. కానీ ఎలాంటి కంక్లూజన్ కు రాలేకపోతున్నారు. కొత్త రిలీజులకు అంతో ఇంతో పాజిటివ్ టాక్ వచ్చినా సరే కనీసం సాయంత్రం షోలకు సగం హాళ్లు నిండలేకపోవడం దయనీయ స్థితికి అద్దం పడుతోంది. ఓటిటిల గురించి కూడా ప్రస్తావన వస్తోంది. ఇవాళ జరిగిన శ్రీవిష్ణు సింగిల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో అల్లు అరవింద్ కొన్ని నగ్న సత్యాలు చెప్పారు.
కరోనా సమయంలో అదృష్టమో దురదృష్టమో ఓటిటి విస్తృతమయ్యిందని, దానికి అలవాటు పడిపోయామని, మార్పులో భాగంగా వచ్చిన ఇలాంటి వాటిని ఆపడం మార్చడం చేయలేమని, చాలా బాగుందని ఏదైనా సినిమా గురించి టాక్ వస్తే తప్ప ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు కాబట్టి వాళ్ళను రప్పించేలా మంచి కంటెంట్ ఇవ్వాల్సిన బాధ్యత దర్శక నిర్మాతల మీదే ఉందని తేల్చి చెప్పారు. అంటే ఎవరి మీదో నెపం తోసేయడం కంటే పొరపాట్లు ఎక్కడ జరుగుతున్నాయో గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన మాటల్లో గుర్తించవచ్చు. ఎప్పటికప్పుడు పోకడలను విశ్లేషించే అరవింద్ గారు ప్రాక్టికల్ గా మాట్లాడారు.
ఇకనైనా కంటెంట్ ప్రాధాన్యం గుర్తించాల్సిన అవసరం చాలా ఉంది. సంక్రాంతికి వస్తున్నాంకి వారాల తరబడి థియేటర్లు నింపిన ఆడియన్సే తర్వాత తండేల్, మ్యాడ్ స్క్వేర్, కోర్ట్ లను కూడా ఆదరించారు. చెప్పుకోదగ్గ స్థాయిలో లేవని టాక్ వచ్చినవి మొదటి రోజే ఎదురీదడం ఏప్రిల్ నెలలో ఎక్కువగా గమనించాం. సో బాగుంటే టికెట్ రేట్లు ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా ఖచ్చితంగా పబ్లిక్ వస్తారనేది వాస్తవం. దాన్ని గుర్తించి స్క్రిప్ట్ స్టేజి నుంచే తప్పులను సరిచేసుకుంటూ క్వాలిటీ మీద దృష్టి పెడితే అసలే ప్రచారం చేసినా చేయకపోయినా థియేటర్లు హౌస్ ఫుల్స్ అవుతాయి. మరి ఈ మార్పు ఇకనైనా మొదలవ్వాలి.