విజయ్ సేతుపతి VS వీరసింహారెడ్డి విజయ్

దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త సినిమా కోసం సెట్ చేస్తున్న క్యాస్టింగ్ చూసి అభిమానులే ఆశ్చర్యపోతున్నారు. రెండు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ల తర్వాత ఏ డైరెక్టర్ అయినా కంబ్యాక్ కి ఎక్కువ సమయం తీసుకుంటారు. అందులోనూ స్టార్స్ అస్సలు పలకరు. కానీ పూరి బ్రాండ్ వేరు. తమిళనాడుకు వెళ్ళిపోయి విజయ్ సేతుపతిని ఒప్పించాడు. తెలుగులో నటించాలంటే సవాలక్ష కారణాలు అడిగే బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ టబుని సింగల్ సిట్టింగ్ లో మెప్పించేశాడు. రాధికా ఆప్టే, నివేద థామస్ లాంటి పేర్లు వినిపిస్తున్నాయి కానీ అధికారికంగా వాటి గురించి ఇంకా సమాచారం రావాల్సి ఉండగా ఇవాళో క్రేజీ అప్డేట్ వదిలారు.

శాండల్ వుడ్ స్టార్ హీరో కం డైరెక్టర్ దునియా విజయ్ ఇప్పుడీ పూరి ప్యాన్ ఇండియా మూవీలో భాగం కాబోతున్నాడు. బాలకృష్ణ వీరసింహారెడ్డిలో విలన్ గా విజయ్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వరలక్ష్మి శరత్ కుమార్ భర్తగా క్రౌర్యాన్ని బాగా పండించాడు. తర్వాత తెలుగులో ఎన్ని ఆఫర్లు వచ్చినా ఒక్కటి కూడా ఒప్పుకోలేదు. కన్నడలో కొసాగుతూ గత ఏడాది భీమాతో హీరో, దర్శకుడిగా సూపర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు పూరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే స్వంతంగా ఫిలిం మేకర్ అయిన విజయ్ ని మెప్పించడం చాలా కష్టమని బెంగళూరు టాక్.

ఏదైతేనేం మెల్లగా అనౌన్స్ మెంట్లతో తన ప్రాజెక్టు మీద బజ్ వచ్చేలా పూరి జగన్నాథ్ తీసుకుంటున్న జాగ్రత్తలు ప్రేక్షకుల్లో అటెన్షన్ వచ్చేలా చేస్తున్నాయి. జానర్, బ్యాక్ డ్రాప్ లాంటివి ఇంకా లీక్ కాలేదు కానీ బిజినెస్ మెన్, పోకిరి తరహాలో కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు బలమైన మాస్ మెసేజ్ తో స్టోరీ రాసుకున్నట్టుగా ఇన్ సైడ్ టాక్. ప్రచారంలో ఉన్న బెగ్గర్ టైటిల్ నిజమో కాదో ఇంకా నిర్ధారణ చేయలేదు. బడ్జెట్ ఎంతనేది బయటికి రాలేదు కానీ యాభై కోట్లకు పైనే ఉంటుందని అంతర్గత సమాచారం. తిరిగి రేసులోకి రావాలని కంకణం కట్టుకున్న పూరి జగన్నాథ్ ఈసారి హిట్టు కొట్టడం కోసం తన అస్త్ర శస్త్రాలన్నీ వాడటం ఖాయం.