OG విలన్ కొత్త సినిమా….పెహల్గామ్ లింక్

పవన్ కళ్యాణ్ OGతో టాలీవుడ్ కు పరిచయం కాబోతున్న బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ కొత్త సినిమా ‘గ్రౌండ్ జీరో’ నిన్న విడుదలయ్యింది. మాములుగా అయితే దీనికి అంత ప్రాధాన్యం దక్కేది కాదేమో కానీ పెహల్గామ్ దుర్ఘటన గురించి దేశమంతా రగిలిపోతున్న వేళ అలాంటి కాన్సెప్ట్ తోనే వచ్చిన గ్రౌండ్ జీరో మీద ప్రేక్షకుల్లో ఆసక్తి రేగింది. సల్మాన్ ఖాన్ టైగర్ 3లో ప్రతినాయకుడిగా నటించి మార్కులు కొట్టేసిన ఈ ఒకప్పటి ముద్దుల వీరుడు ఇప్పుడు సీరియస్ ఆర్మీ ఆఫీసర్ వేషంలో దర్శనమిచ్చాడు. సున్నితమైన పరిస్థితుల మధ్య వచ్చిన ఈ సినిమాలో అంత కనెక్ట్ అయ్యే కంటెంట్ ఏముందో మీరే చూడండి.

2001లో ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన ఇండియన్ పార్లమెంట్ ఎటాక్ సూత్రధారి రానా తహీర్ రహీమ్ అలియాస్ ఘాజి బాబా. ఆర్మీ అధికారులు ప్రయాణించే వాహనాలను బ్లాస్ట్ చేయడంతో పాటు కాశ్మీర్ లోని అమాయక యువకులకు వల విసిరి కేవలం యాభై వేల రూపాయలకు వాళ్ళతో హత్యలు చేయించే రైఫిల్ గ్యాంగ్ సూత్రధారి ఇతనే. అంతకు ముందు 1995లో పెహల్గామ్ లో ఆరుగురు ఫారిన్ టూరిస్టులను కిడ్నాప్ చేసిన నేర చరిత్ర ఇతనికి ఉంది. 2003లో నరేంద్ర దూబే నేతృత్వంలోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఒక ప్రత్యేక మిషన్ ద్వారా ఘాజి బాబాను అత్యంత చాకచక్యంగా మట్టుబెట్టింది. ఆ కథే గ్రౌండ్ జీరో.

తేజ ప్రభాస్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ కి చోటివ్వకుండా ఘాజీ బాబాని మట్టుబెట్టడాన్ని ముందు వెనుకా ఏం జరిగిందనే కోణానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. స్క్రీన్ ప్లే కొంచెం నెమ్మదిగా సాగడం, అవసరం లేని పాటలు, హత్యలకు తెగబడిన కాశ్మీర్ యువకుల మీద సానుభూతి కోణం లాంటివి పంటి కింద రాళ్ళలా అడ్డం పడతాయి. కొన్ని వాస్తవాలు, కొంత ఫ్యాక్షన్ మిక్స్ చేయడంతో పూర్తి నిజాలను ఆవిష్కరించలేదు. అయినప్పటికీ పాక్ తీవ్రవాదుల దుశ్చర్యలు ఎలా ఉంటాయో కొంత మేర బాగానే చూపించారు. దేశప్రజల ఎమోషన్లు తారాస్థాయిలో ఉన్న టైంలో గ్రౌండ్ జీరో ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.