దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమైన పెహల్గామ్ సంఘటన ప్రతి ఒక్కరిని వెంటాడుతూనే ఉంది. అక్కడికి వెళ్లని వాళ్ళు సైతం జరిగిన దారుణాన్ని బాధితుల నోటి వెంట విని కన్నీటి పర్యంతమవుతున్నారు. దీనికి కారణమైన శత్రుదేశం పాకిస్థాన్ మీద ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతిన బూనుతున్నారు. దానికి తగ్గట్టే నిన్న ప్రధాని నరేంద్ర మొదటి ప్రకటించిన అయిదు చర్యలు పాక్ మీద విపరీత ప్రభావం చూపించేవే. ముఖ్యంగా సింధ్ జలాల ఒప్పందాన్ని పాటించబోమని ప్రకటించడం అతి పెద్ద శరాఘాతం. దీని తాలూకు పరిణామాలు పాకిస్థాన్ లో చాలా తీవ్రంగా ఉండబోతున్నాయనేది విశ్లేషకుల అంచనా.
ఇదిలా ఉండగా పాక్ నుంచి వచ్చేది ఏ రూపంలో అయినా ఇండియాలో చోటు ఉండదన్న సందేశాన్ని మరింత బలంగా ఇచ్చే ఉద్దేశంతో ఆ దేశ నటుడు ఫవద్ ఖాన్ నటించిన అబీర్ గులాల్ ని ఇక్కడ నిషేధించే దిశగా బ్రాడ్ క్యాస్ట్ మినిస్ట్రీ చర్యలు చేపట్టబోతోందనే వార్త సంచలనం రేపుతోంది. నిజానికి కెరీర్ మొత్తం పన్నెండు సినిమాలు చేసిన ఫవద్ ఖాన్ కు వాటిలో నాలుగు బాలీవుడ్ వే కావడం గమనార్హం. ఇక్కడ కావాల్సినంత ఖాన్లు ఉండగా అదే పనిగా పాకిస్థాన్ నుంచి తీసుకొచ్చి సినిమాలు తీయాల్సిన అవసరం ఏమొచ్చిందని నెటిజెన్లు భగ్గుమంటున్నారు. వాణి కపూర్ హీరోయిన్ గా నటించిన అబిర్ గులాల్ మే 9 రిలీజ్ కావాల్సింది.
ఈ పరిస్థితుల దృష్ట్యా బ్యాన్ చేసినా చేయకపోయినా అబీర్ గులాల్ వాయిదా పడటం ఖాయం. నిన్నటి దాకా సోషల్ మీడియాలో ప్రమోషన్ పోస్ట్లు షేర్ చేసుకుంటూ వచ్చిన వాణి కపూర్ హఠాత్తుగా మౌనం వహిస్తోంది. టీమ్ సైతం ఎలాంటి ప్రకటన ఇవ్వకుండా సైలెంట్ గా ఉంది. ఇప్పుడు ఏ సమర్ధింపు ప్రయత్నం చేసినా రివర్స్ కొట్టడం ఖాయం. తాను ఇండో అమెరికనని చెబుతున్నా ఫౌజీ హీరోయిన్ ఇమాన్వి ఇస్మాయిల్ మీద సైతం నిరసన గళాలు పెరగడం గమనిస్తున్నాం. ఇది పక్కనపెడితే ఈ దుశ్చర్యకు బదులుగా నీళ్లు, సినిమాలే కాదు మన దేశం నుంచి పాకిస్థాన్ కు అన్నీ ఆపేయాల్సిందనేది ఓపెన్ గా వినిపిస్తున్న డిమాండ్.