వివాదాలకు ఎప్పుడూ దూరంగా ఉండే మహేష్ బాబు ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ కి బ్రాండ్ అంబాసడర్ గా పని చేసినందుకు ఈడి నోటీసులు అందుకోవడం ఇండస్ట్రీలోనే కాదు సగటు జనంలోనూ సంచలనం సృష్టించింది. సదరు సంస్థ వెనుక స్కాములు ఉండటంతో దానికి ప్రమోటర్ గా పారితోషికం తీసుకున్నందుకు మహేష్ ఇప్పుడు అధికారుల ముందు సంజాయిషీ ఇవ్వాల్సి ఉంటుంది. సరే ఇదేదో కావాలని చేసింది కాదనేది అర్థమవుతోంది. కానీ చట్టం లెక్కల్లో నిజాల కన్నా సాక్ష్యాలకే విలువెక్కువ. అందుకే ఈ పరిస్థితి. సరే మహేష్ ఈ సమస్యని పరిష్కరించుకుని బయటికి వచ్చేస్తాడు కానీ ఇక్కడ కొన్ని అంశాలు గమనించాలి.
రెమ్యునరేషన్లు భారీగా ఇస్తున్నారు కదాని దగ్గరికొచ్చిన బ్రాండ్లకు సంతకాలు చేసుకుంటూ పోతే తర్వాత చాలా సమస్యలు వస్తాయి. ఇటీవలే బెట్టింగ్ యాప్ వ్యవహారంలో వాటి వాణిజ్య ప్రకటనల్లో నటించిన నటీనటులు, ఇన్ఫ్లు యెన్సర్లు విచారణ సందర్భంగా ఇబ్బందులు ఎదురుకున్నారు. ప్రకాష్ రాజ్ ఏకంగా వీడియో రూపంలో సారీ చెప్పాడు. ఇటీవలే అల్లు అర్జున్, శ్రీలీల ఒక కార్పొరేట్ కాలేజీకు చేసిన ప్రచారం పట్ల విద్యార్ధి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వీడియోలు విడుదల చేయడం హాట్ టాపిక్ అయ్యింది. గతంలో అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ లాంటి వాళ్ళు సైతం ఇలాంటి చిక్కులు ఎదురుకున్నవాళ్లే.
ఇకపై తమదగ్గరికి వచ్చే కంపెనీల విషయంలో స్టార్లు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ ఉదంతాలు ఋజువు చేస్తున్నాయి. ఎందుకంటే జనాలు హీరో హీరోయిన్లు చెప్పేది నిజమని నమ్ముతారు. కొనుగోలు విషయంలో ప్రభావితం చెందుతారు. ఏదైనా తప్పు జరిగినప్పుడు బాధ్యతను నటీనటుల మీదకు తోసేస్తారు. ఇక్కడ పబ్లిక్ ది తప్పని చెప్పలేం. ఎందుకంటే రోజు టీవీలో, థియేటర్ లో చూస్తూ ఇష్టపడే వ్యక్తులు కావాలని అబద్దాలు చెప్పరనే నమ్మకం వాళ్ళలో ఉంటుంది. అలాంటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన బాధ్యత యాక్టర్ల మీదే ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే ఈ పరిణామాలు హెచ్చరికల్లాంటివి.